ఉమేశ్‌ విజృంభణ: విండీస్ ఆలౌట్‌

13 Oct, 2018 10:27 IST|Sakshi

హైదరాబాద్‌: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్‌ 311 పరుగులకు ఆలౌటైంది. 295/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన విండీస్‌.. మరో 16 పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లను చేజార్చుకుంది. విండీస్‌ ఓవర్‌నైట్‌ ఆటగాడు రోస్టన్‌ ఛేజ్‌(106; 189 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) శతకంతో ఆకట్టుకున్నాడు.అయితే బిషూ(2) ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన కాసేపటికి ఛేజ్‌, గాబ్రియెల్‌లు వెనువెంటనే పెవిలియన్‌ బాటపట్టారు. దాంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. భారత బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ విజృంభించి ఆరు వికెట్లతో సత్తా చాటాడు. చివరి మూడు వికెట్లు ఉమేశ్‌ యాదవ్‌ సాధించడం మరో విశేషం. ఇక కుల్దీప్‌ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వికెట్‌ తీశాడు.

ఉమేశ్‌ అత్యుత్తమ గణాంకాలు

టీమిండియా పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు సాధించడం ద్వారా ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఉమేశ్‌ యాదవ్‌ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు మాత్రమే అత్యుత్తమం కాగా, దాన్ని తాజాగా సవరించాడు. మరొకవైపు స్వదేశంలో ఒక భారత పేసర్‌ నమోదు చేసిన 13వ బెస్ట్‌ ఫిగర్‌గా ఇది నిలిచింది. కాగా, ఈ వేదికలో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసిన తొలి పేసర్‌గా ఉమేశ్‌ నిలిచాడు. గతంలో జహీర్‌ఖాన్‌ (4/69) ప్రదర్శన ఇప్పటివరకూ ఇక్కడ అత్యుత్తమం కాగా, దాన్ని ఉమేశ్‌ యాదవ్‌ బద్ధలు కొట్టాడు.

విండీస్‌ నిలబడింది

మరిన్ని వార్తలు