హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ను ‘మిస్టర్ కూల్’ ఎంఎస్ ధోనితో పోల్చారు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. మ్యాచ్ ఉత్కంఠకరంగా మారినప్పుడు ధోని ఎంత ప్రశాంతంగా ఉంటాడో విలియమ్సన్ కూడా అలాగే ఉంటాడని ప్రశంసించారు. మ్యాచ్ సంక్లిష్టంగా మారినప్పుడు జట్టు సభ్యుల్లో విలియమ్సన్ ఉత్కంఠను తగ్గిస్తున్నాడని పేర్కొన్నారు. ఎంఎస్ ధోని ఏ రకంగా మ్యాచ్ను నడిపిస్తాడో అదే తరహాలో విలియమ్సన్ కూడా జట్టును ముందుకు తీసుకువెళుతున్నాడని కొనియాడారు. ఇదే సన్రైజర్స్ విజయాలకు దోహదం చేస్తుందని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో డేవిడ్ వార్నర్ గైర్హాజరీతో విలియమ్సన్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది సన్రైజర్స్ యాజమాన్యం. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ విలియమ్సన్ తనవంతు పాత్రను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడు.