వర్మ బ్రదర్స్ అదుర్స్

5 Nov, 2016 00:03 IST|Sakshi
వర్మ బ్రదర్స్ అదుర్స్

సెమీస్‌లో సౌరభ్, సమీర్ 

సార్‌బ్రకెన్ (జర్మనీ): బిట్‌బర్గర్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సౌరభ్ వర్మ,  సమీర్ వర్మ సోదరులు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్ సౌరభ్... మూడో సీడ్, ప్రపంచ 13వ ర్యాంకర్ మార్క్ జ్వెబ్లెర్ (జర్మనీ)కు షాకిచ్చాడు. 51 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో అతను 21-15, 16-21, 21-15తో  జ్వెబ్లర్‌ను కంగుతినిపించాడు.

మరో క్వార్టర్స్‌లో 12వ సీడ్ సమీర్ 21-14, 21-16తో అర్టెమ్ పొచ్‌తరోవ్ (ఉక్రెరుున్)పై అలవోక విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సమీర్ 21-17, 21-17తో కీరన్ మెరిలిస్ (స్కాట్లాండ్)పై గెలుపొందగా, సౌరభ్ వర్మ 21-11, 22-20తో ఆరో సీడ్ మౌలానా ఇహ్‌సాన్ (ఇండోనేసియా)కు షాకిచ్చాడు. మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజక్తా సావంత్-యోగేంద్రన్ కృష్ణన్ జంట 15-21, 11-21తో నాలుగో సీడ్ కియాన్ మెంగ్ తన్- పి జింగ్ లై (మలేసియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.

మరిన్ని వార్తలు