హెచ్‌సీఏ నుంచి విశాక లబ్ధి పొందలేదు

19 Jul, 2018 10:06 IST|Sakshi

విశాక ఇండస్ట్రీస్‌ ప్రతినిధి వలీనాథ్‌ స్పష్టీకరణ  

హైదరాబాద్‌: రాజకీయ లబ్ధి కోసమే తమ సంస్థపై బురద చల్లుతున్నారని విశాక ఇండస్ట్రీస్‌ ప్రతినిధి వలీనాథ్‌ ఆరోపించారు. హెచ్‌సీఏ నుంచి విశాక లబ్ధి పొందిందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. కొద్ది నెలలుగా ఉద్దేశపూర్వకంగానే కొందరు తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లీగల్‌ అడ్వైజర్‌ రజనీకాంత్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన రాజీవ్‌గాంధీ స్టేడియం నిర్మాణం కోసం కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి మరీ ఖర్చుపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

స్టేడియం నిర్మాణం కోసం ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో ఆ బృహత్తర కార్యక్రమాన్ని విశాక భుజాన వేసుకుందని చెప్పారు. ఆ సమయంలో స్టేడియానికి విశాక ఇండస్ట్రీస్‌ పేరు పెడతామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. చేసుకున్న అగ్రిమెంట్లకు విలువ ఇవ్వని హెచ్‌సీఏ ఈ విషయాన్ని రాజకీయం చేసి విశాక పేరును తొలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో కోర్టు తీర్పు కూడా విశాకకు అనుకూలంగా వచ్చిందన్న విషయాన్ని గుర్తుచేశారు.  

మరిన్ని వార్తలు