వాట్సన్‌పై వేటు

16 Jul, 2015 01:31 IST|Sakshi
వాట్సన్‌పై వేటు

నేటి నుంచి ఆసీస్, ఇంగ్లండ్ రెండో టెస్టు
 
 లండన్ : బ్యాటింగ్‌లో నిలకడలేమితో యాషెస్ తొలి టెస్టులో అనూహ్యంగా ఓటమిపాలైన ఆస్ట్రేలియా రెండో మ్యాచ్ కోసం సిద్ధమైంది. నేడు (గురువారం) లార్డ్స్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే సిరీస్‌లో 0-1తో వెనుకబడ్డ ఆసీస్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌పై వేటు పడింది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో వాట్సన్ ఎల్బీగా అవుటయ్యాడు. దాంతో పాటు వికెట్లు తీయలేకపోయినా... క్లార్క్ ఎక్కువగా అతనికే బౌలింగ్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది.

ఈ నేపథ్యంలో వాట్సన్ స్థానంలో మిచెల్ మార్ష్‌ను తీసుకునేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. కుటుంబ కారణాల వల్ల వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ కూడా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇతని స్థానంలో పీటర్ నివిల్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. మరోవైపు తొలి టెస్టు గెలుపుతో ఇంగ్లండ్ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్‌లో రూట్, స్టోక్స్, బెల్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో అందరూ సమష్టిగా తొలి టెస్టులో రాణించారు. అయితే ప్రధాన స్పిన్నర్ పాత్ర పోషిస్తున్న మొయిన్ అలీ ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆదిల్ రషీద్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడు.
 
 ఇంగ్లండ్ జట్టుతో అర్జున్ టెండూల్కర్
 సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ఇంగ్లండ్ జట్టుతో కలిసి లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. బుధవారం ఇంగ్లండ్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టు, ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు గతంలో అనేకసార్లు ప్రాక్టీస్ చేసిన అర్జున్ ఈసారి ఇంగ్లండ్ జట్టు యాషెస్ సెషన్‌లో ప్రాక్టీస్ చేయడం విశేషమే. ప్రస్తుతం సచిన్ కుటుంబసమేతంగా లండన్‌లో ఉన్నాడు.

మరిన్ని వార్తలు