మూడుసార్లూ భారత్‌లోనే..

29 Nov, 2019 10:40 IST|Sakshi

లక్నో:  అఫ్గానిస్తాన్‌ మరో చెత్త రికార్డును మూట గట్టుకుంది. వెస్టిండీస్‌తో లక్నో వేదికగా జరిగిన ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 120 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా మూడో అ‍త్పల్ప స్కోరును నమోదు చేసిన అపప్రథను సొంతం చేసుకుంది. అంతకుముందు బెంగళూరులో జరిగిన టెస్టులో అఫ్గానిస్తాన్‌ 109, 108 పరుగులకు చాపచుట్టేసింది. ఆ తర్వాత అఫ్గాన్‌కు ఇదే అత్యల్ప స్కోరు. కాకపోతే మూడు సందర్భాల్లో అఫ్గానిస్తాన్‌ నమోదు చేసిన అత్యల్ప స్కోర్లు భారత్‌లోనే ఉండటం గమనార్హం. భద్రతా కారణాల వల్ల అఫ్గానిస్తాన్‌ తమ మ్యాచ్‌లను భారత్‌లో ఆడుతోంది.

వెస్టిండీస్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్తాన​ 31 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అఫ్గానిస్తాన్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 120 పరుగులకే చాపచుట్టేసింది.. ఓపెనర్‌ జావెద్‌ అహ్మదీ(62) మినహా అంతా నిరాశపరిచారు. వెస్టిండీస్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, రాకిమ్‌ కార్న్‌వాల్‌, రోస్టన్‌ ఛేజ్‌లు తలో మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ పతనాన్ని శాసించారు. మూడో రోజు ఆటలో హోల్డర్‌ మూడు వికెట్లు సాధించి అఫ్గాన్‌ను దెబ్బ కొట్టాడు. అంతకుముందు వెస్టిండీస్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 277 పరుగులకు ఆలౌటైంది.   అదే సమయంలో అఫ్గాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే విండీస్‌ కట్టడి చేసింది.  దాంతో అఫ్గాన్‌ 31 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 6.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌(8) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, క్యాంప్‌బెల్‌(19 నాటౌట్‌), షాయ్‌ హోప్‌(6 నాటౌట్‌)లు మరో వికెట్‌ పడకుండా విండీస్‌కు విజయాన్ని అందించారు. దాంతో విండీస్‌ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మరిన్ని వార్తలు