12వ నంబర్‌ బ్యాట్స్‌మన్‌ బ్లాక్‌వుడ్‌!!

4 Sep, 2019 10:34 IST|Sakshi

కింగ్‌స్టన్‌: భారత్‌-వెస్టిండీస్‌ రెండో టెస్టు సందర్భంగా టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఒక విశేషం చోటు చేసుకుంది. జట్టు తరఫున 12 మంది బ్యాటింగ్‌కు దిగిన ఘటన రెండో టెస్టులో జరిగింది. ‘కన్‌కషన్‌’ కారణంగా డారెన్‌ బ్రేవో రెండో ఇన్నింగ్స్‌లో రిటైర్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. దాంతో అతని స్థానంలో వచ్చిన సబ్‌స్టిట్యూట్‌ జెర్మయిన్‌ బ్లాక్‌వుడ్‌ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో 12 మంది బ్యాటింగ్‌ చేసినట్లయింది. కాగా ఇటీవలే యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన లబ్‌షేన్‌ తొలి ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’గా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ బరిలోకే దిగలేదు కాబట్టి ఆసీస్‌ బ్యాటింగ్‌ 11 మందికే పరిమితమైంది. 

చదవండి : రెండో టెస్టులోనూ విండీస్‌ చిత్తు..సిరీస్‌ కైవసం

ఇక మ్యాచ్‌ మూడో రోజు బుమ్రా వేసిన చివరి ఓవర్‌ నాలుగో బంతి బ్రేవో హెల్మెట్‌కు బలంగా తాకింది. అతని నెక్‌ గార్డ్‌లు కూడా ఊడిపడ్డాయి. ఫిజియో చికిత్స అనంతరం బ్రేవో మిగిలిన రెండు బంతులు ఆడి ఆటను ముగించాడు. మరుసటి రోజు మరో పది బంతులు కూడా ఎదుర్కొన్నాడు. అయితే అనూహ్యంగా అతనికి మగతగా అనిపించి ఇక ఆడలేనంటూ మైదానం వీడాడు. వైద్య పరీక్షల అనంతరం బ్రేవోకు బదులుగా సబ్‌స్టిట్యూట్‌ బ్యాటింగ్‌ చేసేందుకు రిఫరీ అనుమతించారు. కాగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించిన విజయం తెలిసిందే. 257 పరుగుల భారీ తేడాతో విండీస్‌ను ఓడించి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుది. భారత బౌలర్లు విజృంభించడంతో 468 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ జట్టు 210 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టును మట్టి కరిపించిన టీమిండియా ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.    
 

>
మరిన్ని వార్తలు