ప్రశ్నించిన నెటిజన్లు.. మేయర్‌కు ఫైన్‌

4 Aug, 2019 12:12 IST|Sakshi

బెంగళూరు : కొన్నిసార్లు మనం అనాలోచితంగా చేసే పనులు.. తప్పుల జాబితాలో చేరతాయి. తాజాగా ఇలాంటి అనుభవమే బెంగళూరు మేయర్‌ గంగాంబికే మల్లికార్జున్‌కు ఎదురైంది. ఇటీవల కర్ణాటక సీఎంగా బీఎస్‌ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పలువురు వివిధ రూపాల్లో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గంగాంబికే కూడా సీఎంను కలిసి శుభాకాంకక్షలు తెలిపారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేయడానికి తీసుకెళ్లిన డ్రైప్రూట్స్‌ బుట్ట పైభాగంలో ప్లాస్టిక్‌ కవర్‌తో మూశారు.

మేయర్‌ ప్లాస్టిక్‌ వినియోగించడం పట్ల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే గంగాంబికే సీఎం ఇచ్చిన పండ్ల బుట్టకు ప్యాక్‌ చేసిన ప్లాస్టిక్‌ కవర్ లోగ్రేడ్‌కు చెందినదిగా కొందరు నెటిజన్లు గుర్తించారు. ఈ రకం ప్లాస్టిక్‌పై బెంగళూరులో నిషేధం ఉన్నట్టు వారు గుర్తుచేశారు. మేయర్‌ అయి ఉండి నిషేధిత ప్లాస్టిక్‌ను వినయోగిచడంపై గంగాంబికేను ప్రశ్నించారు. ఈ విషయం గంగాంబికేకు తెలియడంతో ఆమె స్వచ్ఛందంగా తన తప్పును అంగీకరించారు. అందుకు క్షమాపణ కూడా కోరారు. బెంగళూరు నగరపాలక సంస్థ జారీ చేసిన 500 రూపాయల జరిమానాను చెల్లించారు. పండ్ల బుట్టను తీసుకురావడానికి వేరే వారిని పంపించడంతోనే ఈ తప్పిదం జరిగిందని గంగాంబికే తెలిపారు. తాను కూడా దానిని చూడకుండానే సీఎంకు అందజేశానని.. చట్టం ముందు అందరు సమానులేనని పేర్కొన్నారు. కాగా, లోగ్రేడ్‌ ప్లాస్టిక్‌ వాడకం బెంగళూరు నగరపాలక సంస్థ 2016లో నిషేధం విధించింది. బెంగళూరు నగరంలో సంపూర్ణ ప్లాస్టిక్‌ నిషేధించాలని పాలికె లక్ష్యంగా పనిచేస్తోన్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు