తల్లిగా లాలిస్తూ.. మేయర్‌గా పాలన చేస్తూ..

18 Sep, 2023 19:31 IST|Sakshi

తిరువనంతపురం: తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు నెలన్నర శిశువును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్లు తెగ స్పందించారు. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న కళ ఇది అని తల్లితనాన్ని కొనియాడుతున్నారు. 

ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో తన నెలన్నర శిశువును ఒడిలో లాలిస్తూ.. ఓవో ఫైల్స్‌పై సంతకాలు చేస్తున్నారు. ఈ ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు ప్రశంసించారు. ఇటు.. వ్యక్తిగతంగా.. అటు.. వృత్తిపరమైన బాధ్యతలను మహిళలు మేనేజ్ చేయగలరని కామెంట్లు పెడుతున్నారు. మహిళలు తల్లితనం కోసం వృత్తిపరమైన లక్ష్యాలను పక్కకుపెట్టాల్సిన అవసరం లేదంటూ స్పందించారు. 

ఆర్య రాజేంద్రన్ ఫొటో బయటకు వచ్చిన నేపథ్యంలో పనిచేసే ప్రదేశాల్లో పిల్లల సంరక్షణ సెంటర్‌ల ప్రాధాన్యతల గురించి చర్చిస్తున్నారు. పనిచేసే ప్రదేశాల్లో తగినన్ని ఏర్పాట్లపై ప్రభుత్వాలు అలసత్వం వహిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. అటు.. ప్రభుత్వ కార్యాలయాల్లోకి పిల్లల్ని తీసుకురాకూడదు కదా..? అంటు మరికొందరు ప్రశ్నించారు. కేవలం ఫొటో షూట్ స్టంట్స్‌గా పేర్కొన్న మరికొంత మంది నెటిజన్లు.. సాధారణంగా రోజూవారి కూలీ చేసుకునేవారికి ఇది సాధ్యమవుతుందా..?అంటూ కామెంట్లు పెట్టారు. 

ఆర్య రాజేంద్రన్(24) 2020లో 21 ఏళ్లకే మేయర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన మేయర్‌గా రికార్డ్‌కెక్కారు.  అదే రాష్ట్రానికి చెందిన సీపీఐఎమ్‌ ఎమ్మెల్యే సచిన్ దేవ్‌ను వివాహం చేసుకున్నారు. సచిన్‌ కూడా దేశంలోనే అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వారికి ఈ ఏడాది ఆగష్టు 10న ఓ ఆడ శిశువు జన్మిచింది.

ఇదీ చదవండి: నూతన పార్లమెంట్: ఆరు దర్వాజలకు ఆరు జంతువులు కాపలా.. అవి దేనికి ప్రతీక..

మరిన్ని వార్తలు