► బార్లో కీచకపర్వం
► టీవీ నటిపై రియల్టర్ కొడుకు దాడి
► అనుచరులతో ఇరువర్గాల ముష్టియుద్ధం
► కబ్బన్పార్క్ పీఎస్లో నటి ఫిర్యాదు
► ఇరువర్గాల ‘రాజీ’
► పోలీసు ఉన్నతాధికారుల ఆరా
బెంగళూరు : పీకలదాకా మద్యం తాగిన ఒక యువకుడు, బుల్లితెర నటిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన బెంగళూరు విఠలమల్య రోడ్డులోని స్కైబార్లో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆ తరువాత భారీ హైడ్రామా నడిచింది.
వివరాల్లోకెళ్తే... విఠలమల్య రోడ్డులో ఉన్న స్కైబార్లో ఆదివారం రాత్రి బిల్డర్ కుమారుడు దర్శన్ అనే యువకుడు వెళ్లి ఫుల్లుగా సేవించాడు. అర్ధరాత్రి 1.20 సమయంలో ఇదే బార్లోకి సర్ప సంబంధ అనే కన్నడ సీరియల్లో నటిస్తున్న ఒక బుల్లితెర నటి వెళ్లింది. ఈ సమయంలో ఆమెపై దర్శన్ చేతులు వేశాడు. ఆమె ప్రశ్నించడంతో... పక్కకు లాక్కెళ్లి గొంతు భాగంలో కొరికినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన నటి స్నేహితులు దర్శన్ను చితకబాదారు. దీంతో దర్శన్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించుకుని వారిపై దాడికి దిగాడు. దీంతో బార్లో కొంతసేపు యుద్ధ వాతావరణం ఏర్పడింది.
యువకుని క్షమాపణతో సరి
అనంతరం బాధిత నటి కబ్బన్పార్క్ పోలీస్స్టేషన్లో పిర్యాదు చేసింది. ఇన్స్స్పెక్టర్ నాగరాజ్ ఇరువర్గాలను పోలీస్స్టేషన్ కు పిలిపించుకున్నారు. దర్శన్ తండ్రి బిల్డర్ శ్రీనివాస్కు ఫోన్ చేసి చెప్పగా, అతను పీఎస్కు వచ్చి మాట్లాడాడు. ఇరువర్గాలతో రాజీ కుదుర్చుకున్నాయి. దర్శన్, బుల్లితెర నటికి క్షమాపణ చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారం అప్పటికే టీవీ చానెళ్లలో రావడంతో పోలీస్ ఉన్నతాధికారులు రాజీ పంచాయతీపై ఇన్స్స్పెక్టర్ నాగరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై బాధిత బుల్లితెర నటి ఉదయాన్నే మాట మార్చింది. తనపై ఎలాంటి లైంగిక దౌర్జన్యం జరగలేదని, అసభ్యంగా మాత్రమే మాట్లాడారని, దర్శన్ క్షమాపణ తెలపడంతో వివాదం సద్దుమణిగిందని మీడియాకు తెలిపింది.
ఆమె ఫిర్యాదు చేయలేదు: డీసీపీ
డీసీపీ చంద్రగుప్త మాట్లాడుతూ.... దర్శన్, బుల్లి తెర నటి పరిచయస్తులని, నటి పోలీస్స్టేషన్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. దర్శన్ జరిగిన సంఘటనకు క్షమాపణ పత్రం మాత్రమే రాసిచ్చారన్నారు. నటి ఫిర్యాదు చేస్తే దర్శన్ పై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.