రుణమాఫీపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

5 Jul, 2015 03:13 IST|Sakshi
రుణమాఫీపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

♦ ఈ నెల 9,10 తేదీల్లో చేపడతాం: అశోక్ చవాన్
♦ మాఫీపై ప్రభుత్వం ఎందుకు కినుక వహిస్తోందని వ్యాఖ్య

 
 సాక్షి, ముంబై : రైతుల రుణ మాఫీ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9, 10వ తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టనున్నట్లు ఎంపీసీసీ అధ్యక్షుడు అశోక్ చవాన్ వెల్లడించారు. ముంబైలోని గాంధీభవన్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది మొదటి అయిదు నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 1059 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం ప్రకటించిందని, ప్రత్యక్షంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశముందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల్లో ఎక్కువ మంది అప్పుల బాధతోనే తనువు చాలించినట్లు తెలిసిందన్నారు.

రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు రుణాల మాఫీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. రైతుల రుణమాఫీ విషయమై ఈ నెల తొమ్మిది, 10వ తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపడతామని చవాన్ పేర్కొన్నారు. ఈ బాధ్యతలను జిల్లా కాంగ్రెస్ నాయకులు అప్పగించామన్నారు.

సతారా జిల్లాలో మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ నేతృత్వంలో జరుగుతాయని, సింధుదుర్గా, ర త్నగిరి జిల్లాలలో జరిగే ఆందోళనకు మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే నేతృత్వం వహించనున్నారని చెప్పారు. అహ్మద్‌నగర్-ఔరంగాబాద్ జిల్లాల్లో ప్రతిపక్ష నాయకుడైన రాధకృష్ణ విఖేపాటిల్  నేతృత్వంలో ప్రదర్శనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు