బాబు ముద్దుల పండుగ చేస్తాడట..!

8 Nov, 2016 20:09 IST|Sakshi
బాబు ముద్దుల పండుగ చేస్తాడట..!

ప్రొద్దుటూరు : ప్రజల కష్టాలు చెప్పుకున్నా తీర్చలేని ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలో బీచ్‌లవ్ ఏర్పాటు చేసి 9వేల జంటలతో ముద్దుల పండగ చేస్తానని చెప్పడం దారుణమైన విషయమని శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య అన్నారు. వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి ఏపీకి రావడం ఇక్కడ టిఫిన్ చేయడం... చంద్రబాబు బాగా పని చేస్తున్నాడని చెప్పడం పరిపాటిగా మారిందన్నారు. వైఎస్సార్ జిల్లాలో వేరుశనగ పంట దెబ్బతినడంతో రైతులు రూ.350 కోట్లు నష్టపోయారన్నారు. అనంతపురం జిల్లాలో మూడు రోజులుండి 8 లక్షల ఎకరాలను రెయిన్ గన్‌లతో కాపాడానని బాబు చెప్పాడన్నారు. అయితే అనంతలోని అన్ని మండలాలను ఎందుకు కరువు మండలాలుగా ప్రకటించారని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు చెప్పింది అబద్ధమని తేలిపోయిందన్నారు.

అగ్రిగోల్డ్ ఏజెంట్లు కొన్ని లక్షల కోట్లు రాబట్టారని, దానిపై విచారణ సరిగా జరగలేదన్నారు. 60 మంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రిటైర్డు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వేలం వేస్తామని కోర్టు ప్రకటించిందంటే ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి ప్రత్యేక హోదాపై మాట్లాడాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు, ఎమ్మెల్యేలు అంతా అవినీతి పరులని, ఇక ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరు ముందుకు వస్తారన్నారు. చంద్రబాబు ఇంటి మరమ్మతులకు రూ.40 కోట్లు, ప్రత్యేక విమానాలకు రూ.కోట్లు ఖర్చు చేశారు. ఇది ఎవడబ్బ సొమ్మని ఖర్చు చేశారో చెప్పాలని సి.రామచంద్రయ‍్య నిలదీశారు.

మరిన్ని వార్తలు