నేడు చెన్నైకి వైఎస్సార్ సీపీ నిజనిర్ధారణ కమిటీ

26 Jun, 2016 11:25 IST|Sakshi

చెన్నై: ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని సదావతి సత్రం భూముల స్వాహా ఉదంతంపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో ఏర్పడిన నిజ నిర్ధారణ కమిటీ చెన్నైశివార్లు ఓఎమ్‌ఆర్ రోడ్డులోని సత్రం భూముల్లో ఆదివారం పర్యటించనుంది. భూముల వేలం వ్యవహారంపై కమిటీ ఆరా తీయనుంది.
 
 అమరావతిలోని సదావర్తి సత్రానికి చెన్నై ఓఎమ్‌ఆర్ రోడ్డులోని 471 ఎకరాలు ఓ దాత నుంచి సంక్రమించాయి. ఇందులోని 83.11 ఎకరాలను ఏపీ ప్రభుత్వ ఎండోమెంటు శాఖ ఈ ఏడాది మార్చిలో వేలం పాట ద్వారా రూ.23 కోట్లకు అమ్మి వేసింది. వెయ్యికోట్ల రూపాయల ఆస్తులను కారుచౌకగా అమ్మివేయడంపై పెద్ద దుమారమే రేగింది. పెదబాబు, చినబాబు సూత్రధారులుగా ఏపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు పాత్రధారులుగా వ్యవహరించి ఈ భూములను కాజేసినట్లు తెలుస్తోంది.
 
 ప్రముఖ పత్రికల్లో ప్రకటన ఇస్తే పాట పెరుగుతుందన్న కుట్రతో ఎవ్వరి కంటపడని రీతిలో ప్రచురింపజేశారు. తద్వారా చెన్నై మహానగరంలో పేరెన్నిగన్న బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవ్వరూ ఓఎమ్‌ఆర్ రోడ్డులోని భూముల వేలంలో పాల్గొనకుండా చేశారు. మొత్తం నలుగురు వ్యక్తులు మాత్రమే పాటల్లో పాల్గొనగా, వీరిలో ముగ్గురు వ్యక్తులు అమరావతి సత్రం ఉన్న గుంటూరు జిల్లా నుంచే రావడం గమనార్హం. పైగా ముగ్గురు వ్యక్తులూ వేలం పాటల్లో పోటీపడినా, ముగిసిన తరువాత ఏకమై ధరావత్తు సొమ్మ చెల్లించడం నేతల, అధికారుల కుమ్మక్కుకు నిదర్శనం. పేరుకే బహిరంగ వేలమైనా అంతా గోప్యంగా సాగింది.
 
 భూములు కాజేయదలుచుకున్న పెద్దలు తెరవెనుక ఉండి నడిపించగా పాత్రధారులు మాత్రమే పాటల్లో పాల్గొన్నారు. వేలం పాటల నిర్వహణలో పాటించాల్సిన ప్రభుత్వ నిబంధనలను తుంగలోతొక్కి మమ అనిపించారు. ఓఎమ్‌ఆర్ రోడ్డులో ఎకరా రూ.6 కోట్ల వరకు పలుకుతుండగా కేవలం రూ.27 లక్షలకు అమ్మివేశారు. ఎకరా రిజిస్ట్రేషన్‌కు రూ.30లక్షల చెల్లించాల్సిన భూములను రూ.27లక్షలకు అమ్మడం ద్వారా భారీ కుంభకోణం బైటపడింది. 83 ఎకరాల ద్వారా రూ.1000 కోట్లు రాబట్టుకోవాల్సిన ఎండోమెంటు అధికారులు రూ.23 కోట్లకే సరిపెట్టుకోవడం ఉత్తుత్తి వేలం పాటల వ్యవహారాన్ని చెప్పకనే చెప్పాయి.
 
 వేలం పాటలు మొత్తం ఒక తంతులా సాగడంతో విస్తుపోయిన ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారిణి ఇదేమని ప్రశ్నించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా అమరావతి ఎమ్మెల్యేకు ఎండోమెంటు అధికారులు వెండి కిరీటం తొడిగి సంబరం జరుపుకున్నారు. చెన్నై లో జరిగింది భూముల వేలం పాటనా, సినిమా పాటల కచ్చేరీనా అనేలా హాస్యాస్పదంగా సాగాయి. ఓ దాత ఎంతో ద యాద్ర హృదయంతో సదావర్తి సత్రానికి ఇచ్చిన కోట్లాది రూపాయల విలువైన భూములు దారి మళ్లడాన్ని అడ్డుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
 
 వేలం పాటల ను రద్దు చేయడం ద్వారా సదావర్తి సత్రానికి సత్వరం న్యా యం జరగాలనే ఉద్దేశంతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పడింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాణి గోవర్దన రెడ్డి, గుంటూరు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్, కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, పలువురు ఎమ్మెల్యేలు అదివారం చెన్నై చేరుకుంటున్నారు. ఉద యం ఓఎమ్‌ఆర్ రోడ్డులోని పలు ప్రాం తాల్లో ఉన్న సదావర్తి సత్రం భూములను సందర్శిస్తారు.
 

>
మరిన్ని వార్తలు