రెండేళ్ల క్రితమే ‘సెంటు’ స్కెచ్‌

17 Oct, 2016 13:16 IST|Sakshi
తమకు జరిగిన అన్యాయాన్ని 'సాక్షి' బృందానికి వివరించేందుకు వచ్చిన బాధితులు

అనంతవరం భూముల్లో అంతులేని అవినీతి
గుట్టుచప్పుడు కాకుండా రికార్డులు తారుమారు
కైంకర్యం చేసిన భూములు అమ్మేశారు
‘సాక్షి’ కథనంతో బైటకొస్తున్న మరింతమంది బాధితులు
రాజధాని రైతుల నుంచి ఫోన్ల వెల్లువ
అన్యాయమైపోయాం.. ఆదుకోవాలంటూ వేడుకోలు
టీడీపీ నాయకులు, సీఆర్‌డీఏ అధికారుల అక్రమాలపై ఆందోళన
న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు కదులుతున్న రైతులు



సాక్షి, అమరావతి బ్యూరో: ఏపీ రాజధాని గ్రామాల్లో ఒకటైన అనంతవరంలో భూములను భోంచేసే ‘పథకం’ ఈనాటిది కాదు. రాజధాని ప్రకటన నాటి నుంచే పథకం పన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా సెంట్ల రూపంలో పెద్ద ఎత్తున భూములను మింగేశారు. రికార్డుల్లో తారుమారు చేసిన భూములను సైతం కొందరు అమ్మి సొమ్ము చేసుకున్నారు. ‘సాక్షి’ కథనంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకొచ్చి తమకు జరిగిన అన్యాయంపై గొంతెత్తుతున్నారు. రెండేళ్ల నుంచి సీఆర్‌డీఏ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోలేదని, పత్రికలకు ఎక్కితే కేసులుపెట్టి జైల్లో పెడతామని బెదిరించారని వారు చెబుతున్నారు. అంతేకాదు భూ అక్రమాలపై రాజధాని పరిధిలోని పలు గ్రామాల నుంచి బాధితులు ‘సాక్షి’ ప్రతినిధులకు ఫోన్లు చేసి అనంతవరం తరహాలోనే తమకూ అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని కోరుతున్నారు.

సీఆర్‌డీఏ అధికారులు, టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలకు నిరసనగా రైతులంతా చేతులు కలుపుతున్నారు.  అనంతవరం గ్రామంలో సుమారు 50 ఎకరాల భూమిని సర్కారు పెద్దలు మింగేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఆక్రమణలను చూసి మనస్తాపంతో ఇదే గ్రామానికి చెందిన రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దాంతో ఈ భూ దందా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ అవినీతి సెంట్ల వ్యవహారంపై ‘సాక్షి’ తీగలాగటంతో డొంకంతా కదులుతోంది.

అవినీతికి పాల్పడి.. పైగా రైతులకు బెదిరింపులు
రాజధాని నిర్మాణం పేరుతో అనంతవరం గ్రామంలోని 1,963 మంది రైతుల నుంచి రాష్ట్రప్రభుత్వం భూ సమీకరణ ద్వారా 2,523 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. ఇపుడు అధికార పార్టీ నేతలు రైతులకు నష్టపరిహారం కింద చెల్లించే ప్లాట్లు, కౌలుపై కన్నేశారు. గ్రామానికి చెందిన అనేక మంది రైతుల భూములను సెంట్ల రూపంలో కొట్టేశారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను కలసి రైతులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పైగా తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. నోరెత్తితే కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తామని బెదిరిస్తున్నారు.

రాంబాబు అనే వ్యక్తి మాత్రం బైటకొచ్చి తనకున్న 47 సెంట్లలో 3 సెంట్లు మాయం చేశారంటూ సీఆర్‌డీఏ అధికారులను ఆశ్రయించారు. ఆ 3 సెంట్లకు సంబంధించి కౌలు చెల్లిస్తాం, ఎవ్వరికీ చెప్పొద్దని సీఆర్‌డీఏ అధికారులు రాజీ చేసే ప్రయత్నం చేశారు. తనకు కౌలుతో పాటు 3 సెంట్ల భూమి కూడా రికార్డుల్లో చేర్చాలని రాంబాబు డిమాండ్‌ చేశారు. అయితే అధికారులు అంగీకరించకపోవటంతో తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట రాంబాబు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇది తెలుసుకున్న రాజధాని గ్రామాల రైతులు తమ రికార్డులను తెప్పించుకుని చూశారు.

అనంతవరంతో పాటు రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, దొండపాడు, పెనుమాక, కృష్ణాయపాలెం, ఐనవోలు, ఉద్దండరాయునిపాలెం గ్రామాల్లోనూ రైతుల భూముల్లో నుంచి సెంట్లు చొప్పున భూములు మాయమయ్యాయని తెలుస్తోంది.  సాక్షిలో ఆదివారం ‘రాజధాని గ్రామాల్లో అవి నీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనం చూసి రైతులంతా ఫోన్లు చేస్తున్నారు. తమ భూమిలో నుంచి కూడా కొంత భూమిని మాయం చేశారని, న్యాయం చేయాలని కోరుతున్నారు.  

మళ్లీ రికార్డుల తారుమారు
రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లో సెంట్ల చొప్పున తగ్గించిన వ్యవహారంపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో ఉలిక్కిపడ్డ టీడీపీ నాయకుడొకరు ఆదివారం రాత్రి రికార్డులను తారుమారు చేశారు. అనంతవరం గ్రామానికి చెందిన పారా సీతారామయ్య పేరున సర్వే నంబర్‌ 287లో 82 సెంట్లు ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చినట్లు గతంలో రికార్డులు సృష్టించారు.  అయితే ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాలతో అదే 287 సర్వే నంబర్‌లో నాదెండ్ల పద్మావతి పేరు చేర్చారు. ఆమె సీఆర్‌డీఏకు 282 సెంట్లు ఇచ్చినట్లు రికార్డులు తారుమారు చేశారు. అలాగే 237/1లో పారా సామ్రాజ్యం 20 సెంట్లు ల్యాండ్‌ పూలింగ్‌కు ఇచ్చినట్లు గతంలో మార్పులు చేశారు. సాక్షి కథనాలతో సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉన్న పారా సామ్రాజ్యం పేరును తొలగించి ఇతరులు అని చేర్పించారు. పారా సీతారామయ్య కుమారుడు రాజధాని కమిటీలో సభ్యుడు కావడం గమనార్హం. కాగా పస్తుతం ‘సాక్షి’ వద్ద ఉన్న రికార్డులు తప్పు అని చూపించి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

తారుమారు చేసి కొట్టేసిన భూములు అమ్మేశారు
యడ్లూరి సాంబశివరావుకు సర్వే నంబర్‌ 100ఈలో 1.24 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 44 సెంట్ల భూమి మాయమైంది. అదే భూమిని స్థానిక టీడీపీ నాయకులు నలుగురు కలసి ఉప్పాల జ్ఞానేశ్వరికి అమ్మి సొమ్ము చేసుకున్నారు. అదే విధంగా కొమ్మినేని శ్రీనివాసరావుకు చెందిన 2.64 ఎకరాల్లో నుంచి 25 సెంట్లు మాయం చేసి గుంటూరు జిల్లా రాజోలుకు చెందిన వెంకటేశ్వర్లుకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చందోలు పూర్ణచంద్రరావుకు 120ఎ లో 1.88 సెంట్లు భూమి ఉంది. అందులో 11 సెంట్లను మాయం చేసి వేరొకరికి కట్టబెట్టినట్లు పూర్ణచంద్రరావు ఆరోపించారు. సుంకర విజయకుమారి, గోపిదేశి మీరాకుమారితో పాటు పలువురు గ్రామస్తులంతా ‘సాక్షి’ ప్రతినిధులకు రికార్డులను చూపించి సీఆర్‌డీఏ, రెవెన్యూ, స్థానిక టీడీపీ నేతలు చేసిన దారుణాలను వివరించారు. ఈ భూములను మాయం చేసి వేరొకరికి అప్పగించేందుకు రైతుల పేర్లు, వేలిముద్రలను ఫోర్జరీ చేసినట్లు యర్రా వెంకాయమ్మ ఆరోపించారు.

ఇదిలా ఉంటే శాఖమూరులో సర్వే నంబర్‌ 86/ఏలో 2.40 ఎకరాల భూమిని 1972లో 44 మంది దళిత గిరిజన కుటుంబాలకు 4 సెంట్లు పంపిణీ చేశారు. ఈ మొత్తం భూమిని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడొకరు గుట్టుచప్పుడు కాకుండా ల్యాండ్‌పూలింగ్‌కు ఇచ్చేశారు. రాయపూడిలో 140 మంది రైతుల భూముల నుంచి కొంత భూమి మాయం చేసినట్లు ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. రాజధాని గ్రామాల నుంచి అనేక మంది బాధితులు బయటకు వస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు