ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతున్న భార్యను ..

2 Jan, 2019 09:44 IST|Sakshi

టీ.నగర్‌: ప్రియుడితో ఉల్లాసంగా గడుపుతున్న భార్యను కత్తితో నరికి చంపిన భర్త అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. కోవిల్‌పట్టిలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి నటరాజ పురం అయిదో వీధికి చెందిన మారిముత్తు (29) ఆటో డ్రైవర్‌. ఇతని భార్య విమల (25). వీరికి కావ్య శ్రీవిద్య (4) అనే కుమార్తె ఉంది. అదే ప్రాంతంలో వెల్డింగ్‌ వర్క్‌షాప్‌లో పని చేస్తున్న కుమార్‌ (20)తో విమలకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇరువురు తరచుగా ఏకాంతంగా కలుసుకునేవారు. భార్య ప్రవర్తనను మారిముత్తు ఖండించాడు. 

దీంతో దంపతుల మధ్య తరచూ  గొడవలు జరుగుతుండేవి. ఈ స్థితిలో వారం రోజుల కిందట నటరాజపురం అయిదో వీధి నుంచి పక్క వీధికి తన కాపురాన్ని మారిముత్తు మార్చాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మారిముత్తు కుటుంబంతో కలిసి నిద్రిస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో బిడ్డ రోదించింది. ఆ సమయంలో మారిముత్తు లేచి భార్య కోసం చూడగా కనిపించలేదు. అదే సమయంలో అత్త ఇంటికి వెళ్లి విచారణ జరుపగా అక్కడికీ రాలేదని తెలిపారు. 

దీంతో అనుమానించిన మారిముత్తు వెంటనే తన పాత ఇంటికి వెళ్లాడు. అక్కడ విమల, కుమార్‌తో ఉల్లాసంగా గడుపుతూ కనిపించింది. దీంతో ఆగ్రహించిన మారిముత్తు అక్కడున్న ఇనుప పైప్‌ను తీసుకుని కుమార్‌పై దాడి చేశాడు. గాయపడిన కుమార్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి సమీపంలో లభించిన కత్తిని తీసుకుని విమలపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో విమల సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. తర్వాత చేతిలో కత్తితో పాటు మారిముత్తు కోవిల్‌ పట్టి వెస్ట్‌ పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడిందని హత్య:
టీ.నగర్‌: సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడినందున ఆగ్రహంతో 19వ అంతస్తు నుంచి కిందకు తోసి భార్యను హతమార్చినట్టు అరెస్టయిన భర్త పోలీసులకు సోమవారం వాగ్మూలం ఇచ్చాడు. చెన్నై సమీపంలో గల తాలంబూర్‌లో 30 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీకి చెందిన సంతోష్‌కుమార్‌ (28). అతని భార్య బీలాదేవి (22)తో సహా పలువురు పని చేస్తున్నారు. గత నెల 27వ తేదిన 19వ అంతస్తులో నేలను శుభ్రం చేస్తుండగా అక్కడినుంచి కిందపడి బీలాదేవి మృతి చెందింది. దీనిపై విచారణ జరిపిన తాలంబూరు పోలీసులు కేసు నమోదు చేసి, ఆమె భర్త వద్ద విచారణ జరిపారు. బీలాదేవి సహ కార్మికుడితో నవ్వుతూ మాట్లాడడంతో అనుమానించి ఆమెను కిందకు తోసి, హత్య చేసినట్లు ఆమె భర్త పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో తెలిపాడు. దీంతో సంతోష్‌కుమార్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచి మంగళవారం జైల్లో నిర్బంధించారు.  

మరిన్ని వార్తలు