నేను తప్పు చేశాను

20 May, 2015 02:43 IST|Sakshi
నేను తప్పు చేశాను

 విశ్వరూపం -2 విషయంలో తప్పు చేశానని నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. లోక నాయకుడు కమలహాసన్ చిత్రాల్లో కొన్ని ప్రేక్షకులకు నచ్చి  ఉండక పోవచ్చు. అయితే, నటుడుగా ఆయన మాత్రం ఫెయిల్ కాలేదు. నటనకు సరి కొత్త భాష్యం ఇచ్చిన కమలహాసన్ ఒక నట పిపాసి అని చెప్పవచ్చు. అలాంటిది ఇటీవల ఆయన కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. విశ్వరూపం, ఉత్తమ విలన్ చిత్రాల విడుదల సమయంలో పలు సమస్యలను చవి చూశారు. కమలహాసన్ ఇటీవల ఢిల్లీలో జరిగిన  అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో పాల్గొన్నారు.
 
 ఈ చిత్రోత్సవాల్లో విశ్వరూపం చిత్రం ప్రదర్శించారు. కమల్ విలేకరులతో మాట్లాడుతూ విశ్వరూపం చిత్రం సెన్సార్ సర్టిఫికెట్ పొందినా విడుదలకు చాలా కాలం వేచి  ఉండాల్సి వచ్చిందన్నారు.  కారణం ఆ చిత్రానికి పలు సంఘాలు వ్యతిరేకించడమేనని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ఉత్తమ విలన్ చిత్రం విడుదల సమయంలోనూ తాను వివాదాలకు గురి అయ్యానని పేర్కొన్నారు. తానేమి ప్రజా వ్యతిరేక చిత్రాల నటుడ్ని కాదు అని, అలాగే, ప్రేక్షకుల్ని ఎగతాళి చేసే చిత్రాలను ఎప్పడూ తీయనని పేర్కొన్నారు. వారికి వినోదాన్ని పంచే చిత్రాల్నే తాను నిర్మించాననన్నారు.
 
 విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా విశ్వరూపం -2 రూపొందించానని,  ఆ చిత్రం చివరిలో కూడా శుభం లేకుండా, కొనసాగింపు ఉం టుందని సూచించామన్నారు. అయితే, ప్రస్తుతం విశ్వరూపం -3 తీసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సమస్యల నుంచి తప్పించుకునేందుకు ఆ చిత్రాన్ని విడుదల హక్కుల్ని వేరే నిర్మాతకు అప్పగించానన్నారు. అదే తాను చేసిన పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ఆయన నటించిన పాపనాశం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కమల్ హాసన్ పూంగా వనానికి రెడీ అవుతున్నారు.
 

మరిన్ని వార్తలు