అభాగ్యులకు డీయూఎస్‌ఐబీ అండ

26 Nov, 2014 23:27 IST|Sakshi

న్యూఢిల్లీ: చలికాలం వచ్చిందంటే ఇళ్లలోనే దుప్పట్లు..ఎవరి మోతాదులో వారు చలిని తట్టుకొనేందుకు కుస్తీపడుతుంటారు. మరీ! ఇళ్లులేని నిరుపేదలు, ఇంకా చెప్పాలంటే ఇల్లేకాదు, ఏ అండా ఆ దెరువు లేనోళ్లు చలికాలంలో గజగజ వణుకుతూ వీధుల వెంటే ఏ చెట్టుకిందో..పుట్టకిందో తలదాచుకొంటారు. అలాంటి అనాధలు, అభాగ్యులకు, వలస వచ్చే ప్రజలకు ఢిల్లీ పట్టణ నివాస అభివృద్ధి బోరు ్డ(డీయూఎస్‌ఐబీ)అండగా ఉంటానంటోంది. ఇందులో భాగంగా చలికాలంలో వారికి కనీస సౌకర్యాలను కల్పించడానికి నడుంబిగించింది.పెరుగుతున్న వలసలు: రోజురోజుకూ దేశ రాజధాని ప్రాంతానికి(ఎన్‌సీఆర్) వలసల తాకిడి పెరుగుతోంది. భవిష్యత్‌లో ఇదే ప్రధాన సవాల్‌గా మారనుంది. దీన్ని అధిగమించడానికి సెప్టెంబర్‌లోనే ప్రణాళిక సిద్ధం చేసింది. అన్నీ సంపూర్తిగా పూర్తి అయ్యాయి. చలికాలాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని డీయూఎస్‌ఐబీ డెరైక్టర్ కమల్ మల్‌హోత్రా మంగళవారం తెలిపారు.

ఇప్పటికే 20,000 శద్దర్లు, 5,000 డేరాలు,5,000 జ్యూట్ మ్యాట్‌లకు ఆర్డర్లు ఇచ్చామని చెప్పారు. బహిరంగ టెండర్లు నిర్వహించామని, త్వరలోనే సామగ్రి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. నగరంలో వలసలు ప్రధాన సమస్యగా మారిందని అన్నారు. ఆశ్రయం పొందేవారికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. అయితే ఈ సమస్య తీవ్రమవుతున్నప్పటికీ నివాసం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంది. కానీ, అంత స్థలం అందుబాటులో లేదని అన్నారు.ఇప్పటికే 184 షెల్టర్లు..: ఇప్పటికే నగరంలో 184 రాత్రి షెల్టర్లు ఉన్నాయి, ఇందులో సుమారు 14,500 మంది ఆశ్రయం పొందుతున్నారు. వలసలు ఇలా పెరిగితే వారి అవసరాలు తీర్చలేమని, అయినప్పటికీ సాధ్యమైనన్ని రాత్రి షెల్టర్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 7,000 వేల చదరపు మీటర్ల స్థలాన్ని డీడీఏ నుంచి కొనుగోలు చేశామని, మరో ప్రాంతంలో కూడా ఇలాగే తీసుకోనున్నామని చెప్పారు, ఇంకో రెండు షెల్టర్లు నవంబర్ 30 వరకు యమున పుస్తాలో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

వైద్యసేవలు: ఇళ్లులేని పేదలకు తక్షణమే వైద్యపరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ సూచించారని, ఈ మేరకు ఇళ్లలేని వారికి వైద్యపరీక్షలు కూడా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నామని  కమల్ మల్‌హోత్రా చెప్పారు. ఆరోగ్యశాఖ అదనపు డెరైక్టర్ డాక్టర్ కేఎస్ భగోటియా తన బృందంతో డీయూఎస్‌ఐబీ సహకరిస్తారని చెప్పారు. సంచార వైద్య బృందాలు అన్ని ప్రాంతాల్లో షెల్టర్లలో ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. ప్రధానంగా ఈ షెల్టర్లలో ఉండేవారు క్షయ, హెచ్‌ఐవీ భారిన పడుతున్నారని చెప్పారు. వీరందరికీ అవసరమైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. మరో ప్రధాన సమస్య నగరంలో మాదక ద్రవ్యాల బానిసలు పెరిగిపోతున్నారని, దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు.
 

మరిన్ని వార్తలు