ఎల్‌టీటీ.. లోపాల పుట్ట!

23 Jan, 2014 00:23 IST|Sakshi

సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన తెలుగు యువతి ఎస్తేర్ అనూహ్య ముంబైలో రైలు దిగిన అనంతరం ఎటువైపు నుంచి వెళ్లిందనేది పోలీసులకు ఇంతవరకు తెలియరాలేదు. ఎంతో కీలకంగా భావించే సీసీటీవీ కెమెరాల్లో అనూహ్యకు సంబంధించిన ఎలాంటి ఫుటేజ్‌లు లభించలేకపోవడం గమనార్హం. అత్యాధునిక సాంకేతిక పరి/ా్ఞనం వినియోగిస్తున్నామని పేర్కొనే పోలీసులకు ఇంత వరకు ఒక్క ఆధారం కూడా సేకరించకపోవడంపై అనూహ్య బంధువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నగరంతోపాటు దేశంలోని ప్రముఖ రైల్వేస్టేషన్లలో ఒక్కటైన ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్‌టీ), దాదర్ టర్మినస్‌లపై కొంత భారాన్ని తగ్గించేందుకు లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్‌టీ టీ)ను నిర్మించారు. అనంతరం దీన్ని అత్యాధునిక పరి/ా్ఞనంతో ఆధునికీకరించారు. అయినప్పటికీ రైలు దిగిన అనూహ్య గురించి సీసీటీవీలో ఎలాంటి సమాచారం లభించకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుర్లా టర్మినస్‌లో భద్రతా ఏర్పాట్లపై ‘సాక్షి’ దృష్టి పెట్టగా పలు లోపాలు బయటపడ్డాయి.

 ఇక్కడ మెటల్ డిటెక్టర్లున్నప్పటికీ ప్రయాణికులు నేరుగా వెళ్లడం విశేషం. మరోవైపు ఫ్లాట్ ఫారం ముందు నుంచి వెళితే  అక్కడ పోలీసుల జాడ లేదు. ఈ టర్మినస్‌లో మొత్తం అయిదు ఫ్లాట్ ఫారాలున్నాయి. ఒకటో ఫ్లాట్‌ఫారం విడిగా ఉండగా రెండు, మూడు ఫ్లాట్‌ఫారాలు, నాలుగు, అయిదు ఫ్లాట్ ఫారాలు కలిసి ఉన్నాయి. ఈ ఫ్లాట్ ఫారాలన్నింటిపై నుంచి బయటికి వెళ్లేందుకు ఒకే ఒక్క పాదచారుల వంతెన ఉండగా ఒకటో నంబరు ఫ్లాట్‌ఫారంపై ప్రధాన ద్వారం ఉంది. అయితే ముందువైపు నుంచి మాత్రం నేరుగా వెళ్లేందుకు ఆస్కారం ఉంది.  ఇక అనూహ్య రైలు దిగిన మూడవ నెంబరు ఫ్లాట్ ఫారాాన్ని పరిశీలించినట్టయితే నాలుగు సీసీ టీవీలున్నాయి.

 ఫ్లాట్‌ఫారం మధ్యలో ఉన్న పాదచారుల వంతెన వరకు నాలుగు సీసీటీవీలు సుమారు
  40 నుంచి 50 అడుగుల దూరంలో అమర్చి ఉన్నాయి. అయితే ఇవన్నీ డౌన్ వైపు చిత్రీకరించేవిధంగా ఉన్నాయి. దీంతో వీటిలో అనూహ్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసు ఇన్‌స్పెక్టర్ శింతే తెలిపారు. దీంతో రెండో నంబర్ ఫ్లాట్‌ఫారంలోని సీసీటీవీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఆయన చెప్పారు.

 దీనిపై కూడా కేవలం ఆరు సీసీటీవీ కెమెరాలున్నాయి. వీటిలో మొదటి మూడు ఫ్లాట్ ఫారం మూడుపై ఉన్నట్టుగానే దిగువ వైపు చిత్రీకరించే విధంగా ఉండగా, తర్వాత కెమెరా ఎగువ వైపు, మరొకటి దిగువ దిశగా ఉన్నాయి. అయితే ఇవన్ని కూడా పాదచారుల వంతెన తర్వాత మరో రెండు మూడు బోగీలు కనిపించే విధంగా ఉన్నాయని  చెప్పవచ్చు. కాని ఇంజిన్‌వైపు నుంచి వెళితే మాత్రం ఎవరూ కన్పించే అవకాశంలేదు. దీంతో అనూహ్య అటునుంచి వెళ్లిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ముందువైపు ఎగ్జిట్, ఎంట్రెన్స్‌లో కూడా సీసీ టీవీలున్నట్టయితే అనూహ్య కన్పించి ఉండడంతోపాటు ఆమెను కాపాడుకునేందుకు కూడా ఆస్కారం ఉండేదని భావిస్తున్నారు.

అయితే ఊరినుంచి వెళ్లిన ప్రతిసారీ అటోలోనే ఇంటికి వెళ్లే అనూహ్య ఈసారి కూడా ఎటువైపు నుంచి అటోలో వెళ్లిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటి వరకు పలువురిని విచారించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలుపుతున్నారు. మరోవైపు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని వైపుల సీసీటీవీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.

>
మరిన్ని వార్తలు