హత్యకేసులో ముగ్గురి అరెస్ట్

8 Aug, 2013 02:38 IST|Sakshi
తిరుత్తణి, న్యూస్‌లైన్: తిరుత్తణి పెద్దవీధికి చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ తిరువళ్లూరు పడమర జిల్లా సహాయ కార్యదర్శి  పసుంపొన్‌రాజా హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. పసుం పొన్‌రాజా భార్య శరణ్య. పెళ్లికి ముందే ఈమె తిరుత్తణి నెహ్రూనగర్ ఆచారి వీధికి చెందిన శశికుమార్ (35)తో ప్రేమకలాపాలు సాగించింది. శశికుమార్ పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. ఈమెకు వేరొకరితో పెళ్లి అయిన తర్వాత కూడా శశికుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసి భర్త పసుంపొన్‌రాజా శరణ్యను మందలించాడు.  
 
 కక్ష కట్టిన శరణ్య, శశికుమార్‌తో కలసి భర్తను హతమార్చడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో శశికుమార్ స్థానిక ఇంద్రానగర్‌కు చెందిన ఆటోడ్రైవర్లు నాగరాజు (27), సుకుమారన్ సహాయాన్ని తీసుకున్నాడు. పసుంపొన్‌రాజా వ్యాపార విషయంగా అగూర్ ప్రాంతానికి వెళ్లి బైక్‌లో వస్తుండగా పసుంపొన్ రాజాను హత్య చేశారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్, నాగరాజు, శరణ్యను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సుకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను తిరుత్తణి కోర్టులో హాజరు పరచి, పుళల్ జైలుకు తరలించారు.
మరిన్ని వార్తలు