బెంగళూరు (మంగళూరు): రోడ్డుపై తనను వేధించిన ఆకతాయికి ఓ యువతి క్లాస్ పీకుతూ ఫేస్బుక్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్గా మారడంతో యువతి చేసిన పోస్ట్కు వేలకొద్ది లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం రష్మీ అనే యువతి అలోషియన్ కాలేజీ నుంచి బల్మఠకు నడుచుకుంటూ వెళుతున్నారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంలో వచ్చిన ఓ యువకుడు రష్మీని వేధించసాగాడు.
ఈ సమయంలో రష్మీ యువకుడి బైక్ను ఫొటో తీసుకొని ఇంటికి వెళ్లిన అనంతరం ఇంటర్నెట్లో బైక్ వివరాలు సేకరించి ఆ వెంటనే ఆ ఆకతాయి ఫొటోను తన ఎఫ్బీ ఖాతాలో షేర్ చేస్తూ ఆ యువకుడు వేధించిన తీరును ప్రస్తావించారు. మీ లాంటి అనాగరికులకు నగర రోడ్లపై ఎంత అధికారం ఉందో తనకు కూడా అంతే అధికారం ఉందని నీ లాంటి పోకిరీలకు తాను భయపడి ఇంట్లో కూర్చునే ప్రసక్తే లేదని ఇలాంటి ఘటనల్లో ఎవరూ మద్దతుగా రాకపోయినా నీ లాంటి పోకిరీలను వంద మందిని ఎదిరించగలిగే ధైర్యం ఉందంటూ రష్మీ పోస్ట్ చేశారు.
రష్మీ చేసిన పోస్ట్ ఎఫ్బీలో వైరల్గా మారడంతో ఆమెను అభినందిస్తూ వేలకొద్ది లైకులు, కామెంట్లు వస్తున్నాయి. కాగా రష్మీ పోస్ట్ చేసిన ఆమె ఎఫ్బీ ఖాతాలోని కొందరు మిత్రులు నగర పోలీస్ కమిషనర్కు కూడా పోస్ట్ను ట్యాగ్ చేయడంతో పోలీసులు నగర మహిళా పోలీస్ స్టేషన్లో స్వచ్ఛదంగా కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా బైకు రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం యువకుడి పేరు రిజ్వాన్ అహ్మద్గా తెలిసింది.