ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

1 Aug, 2018 11:19 IST|Sakshi
ధర్నా చేస్తున్న కనిమొళి

అన్నానగర్‌: పెన్నడం సమీపంలో ప్రియుడి ఇంటి ముందు మహిళ సోమవారం ధర్నా చేసింది. వివరాలు.. కడలూరు జిల్లా పెన్నడం సమీపం సౌందర సోళపురానికి చెందిన రామమూర్తి రిటైర్డ్‌ గ్రామ నిర్వాహక అధికారి. ఇతని కుమార్తె కనిమొళి (31) ఎంఏ పట్టభద్రురాలు. ఈమె పెన్నడంలోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తోంది. సౌందర సాళపురానికి చెందిన మురుగేశన్‌ కుమారుడు జానకిరామన్‌ (32) డీఎంకే కార్యదర్శి. ఇతను పెన్నడంలో ఇటుకలబట్టి నడుపుతున్నాడు. కనిమొళి జానకిరామన్‌ ప్రేమించుకున్నారు.

ఈ క్రమంలో కనిమొళి వివాహం చేసుకోవాలని జానకిరామన్‌ను కోరింది. అందుకు అతను అంగీకరించలేదు. దీంతో విరుదాచలం మహిళ పోలీసుస్టేషన్‌లో కనిమొళి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ స్థితిలో జానకిరామన్‌ హఠాత్తుగా పరారయ్యాడు. కనిమొళి అతని కోసం వెతికినా ఆచూకీ తెలియలేదు. కనిమొళి సోమవారం సౌందరపాళయపురంలోని జానకిరామన్‌ ఇంటికి వెళ్లింది. జానికిరామన్‌ తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. జానకిరామన్‌తో వివాహం చేయాలని కోరగా అందుకు వారు నిరాకరించారు. దీంతో కనిమొళి అక్కడే బైఠాయించి ధర్నా చేసింది. సమాచారంతో పెన్నడం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కనిమొళితో మాట్లాడారు. జానకిరామన్‌తో వివాహం చేసే వరకు కదలనని అక్కడే పోరాటం చేస్తోంది.

మరిన్ని వార్తలు