Heavy Rains In Tamilnadu: తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్‌ బంద్‌, పలు రైళ్లు రద్దు

10 Nov, 2023 11:43 IST|Sakshi

చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించిపోయింది. వరదల కారణంగా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు.. 12 జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. 

అయితే, తమిళనాడువ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. కోయంబ‌త్తూరు, తిరువూర్, మ‌ధురై, థేనీ, దినిదిగుల్ జిల్లాల్లో గురువారం కుండ‌పోత వాన కురిసింది. ఇక, నీలగిరి జిల్లాలోని ఐదు తాలుకాల‌ను వ‌ర్షం ముంచెత్తింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మైలదుత్తురై, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్‌, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఇక, భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్కూల్స్‌, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా తిరువారూర్‌ జిల్లా, పుదుచ్చేరిలోని కారైక్కల్‌లోని పాఠశాలలను నేటి నుంచి మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇదే సమయంలో వర్షం కారణంగా పలు రైళ్లను కూడా రద్దు చేశారు రైల్వే అధికారులు. నీలగిరి మౌంటైన్‌ రైల్వేలోని కల్లార్‌, కూనూర్‌ సెక్షన్ల మధ్య ట్రాక్‌పై కొండచరియలు, చెట్లు కూలిపడటంతో నవంబర్‌ 16 వరకు ఆ రూట్స్‌లో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మెట్టుపాళయం నుంచి ఉదగమండలం వరకు నడిచే 06136, 06137 ప్యాసింజర్ ప్రత్యేక రైళ్లను నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు