ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి నకిలీనే

29 Mar, 2017 19:38 IST|Sakshi
ప్రతి ఐదు ఫోన్లలో ఒకటి నకిలీనే
దుబాయ్ : మార్కెట్లో శరవేగంగా విక్రయాలు  దూసుకెళ్లే ఉత్పత్తులు ఏమన్న ఉన్నాయా? అంటే అవి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులే. వాటిలో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు. వినియోగదారులు చూపుతున్న ఆసక్తికి కంపెనీలు కూడా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మార్కెట్లను దుమ్మురేపుతున్నాయి. కానీ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఇతర  ఎలక్ట్రిక్ డివైజ్ లు కొనేటప్పుడు వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. ప్రతి ఐదు స్మార్ట్ ఫోన్లలో కనీసం ఒకటి నకిలీదేనని తాజా రిపోర్టుల్లో వెల్లడవుతోంది. నాలుగు వీడియో గేమ్ ల కన్సోల్స్ కూడా ఒకటి ఫేకేనని తేలింది. దీనిపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) మంగళవారం ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 
 
మార్కెట్లోకి వస్తున్న నకిలీ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఎలక్ట్రిక్ డివైజ్ లతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇవి కేవలం తక్కువ నాణ్యతను కలిగి ఉండటమే కాక ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయని ఓఈసీడీ రిపోర్టు హెచ్చరించింది. అమెరికా నుంచి వచ్చే పాపులర్ ఉత్పత్తులను చాలామంది కాపీ చేస్తున్నారని పేర్కొంది. మంచి ఫోన్లతో పోలిస్తే నకిలీ ఫోన్లలోనే ఆరోగ్యానికి హానికలుగజేసే సీసం, కాడ్మియంలను ఎక్కువ ఉన్నాయని ఓఈసీడీ రిపోర్టు పేర్కొంది. నకిలీ ఫోన్ల ఛార్జర్లు పేలుళ్లకు, ఎలక్ట్రిక్ షాక్లకు గురవుతాయని రిపోర్టు నివేదించింది.  అమెరికా కంపెనీల మేథో సంపత్తి హక్కులు ఉల్లంఘించి నకిలీ ఉత్పత్తులను తయారుచేసి మార్కెట్లోకి తెస్తున్నట్టు తెలిపింది.
 
దీంతో కంపెనీల బ్రాండు వాల్యు దెబ్బతిని, రెవెన్యూలు కోల్పోతున్నాయని పేర్కొంది.  ఈ కారణంతో 2011, 2013కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కనీసం సగం శాతం(43శాతం) ఉత్పత్తులను సీజ్ చేసినట్టు రిపోర్టు తెలిపింది. అసలివి ఏవో నకిలీవి ఏవో తెలుసుకోలేకపోతుండటంతో ఫేక్ ఉత్పత్తులకు మార్కెట్లో వస్తున్న సంపద కూడా ఎక్కువగానే ఉంది. 143 బిలియన్ డాలర్ల(రూ.9,27,648కోట్ల) విలువైన నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో ఇప్పటికే అమ్ముడు పోయినట్టు తెలిసింది.  ఫేక్  ఉత్పత్తులను తయారుచేయడంలో చైనానే ప్రధాన సోర్స్ గా ఉందని రిపోర్టు వెల్లడించింది. 
 
మరిన్ని వార్తలు