భారత్‌లో బెస్ట్‌-సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్లివే!

27 Jul, 2017 20:12 IST|Sakshi
భారత్‌లో బెస్ట్‌-సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్లివే!
షావోమి స్మార్ట్‌ఫోన్లు ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో హల్‌ చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రయానికి వచ్చిన ప్రతిసారి షావోమి ఫోన్‌లు సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్నాయి. 10వేల రూపాయల కన్నా ధర తక్కువగా ఉన్న కేటగిరీలో షావోమి స్మార్ట్‌ఫోన్లు, శాంసంగ్‌ను బీట్‌ చేశాయి. బెస్ట్‌-సెల్లర్‌ స్లాటును దక్కించుకున్నాయి. 2017 రెండో క్వార్టర్‌లో భారత్‌లో రూ.10వేల కన్నా తక్కువున్న స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌లలో షావోమి బెస్ట్‌ సెల్లర్‌గా నిలిచినట్టు కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. షావోమికు చెందిన రెడ్‌మి నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ 7.2 శాతం మార్కెట్‌ షేరును, రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్‌ 4.5 శాతం మార్కెట్‌ షేరును సొంతం చేసుకుని తొలి రెండు స్థానాల్లో నిలవగా... వీటి తర్వాత 4.3 శాతం మార్కెట్‌ షేరుతో శాంసంగ్‌ గెలాక్సీ జే2 ఉన్నట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. 
 
రూ.10వేల ధర కలిగిన​ పోర్ట్‌ఫోలియోలో షావోమికి స్ట్రాంగ్‌ డిమాండ్‌ వస్తుందని, 2017 ప్రథమార్థంలో రెడ్‌మి నోట్‌ 4 టాప్‌ సెల్లింగ్‌ మోడల్‌గా చోటు దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పథక్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో శాంసంగ్‌ను వేరే బ్రాండు అధిగమించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా బెస్ట్‌-సెల్లర్‌ స్లాటులో శాంసంగ్‌ మోడల్సే నిలిచాయని చెప్పారు. కానీ ఈసారి ట్రెండ్‌ రివర్స్‌ అయిందన్నారు. అయితే మొత్తంగా స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్‌ ఫోన్ల సరుకు రవాణాల్లో శాంసంగ్‌ కంపెనీనే మొదటి స్థానంలో ఉంది. ఫీచర్‌ ఫోన్‌ కేటగిరీలో 25.4 శాతం మార్కెట్‌ షేరు ఉండగా.. స్మార్ట్‌ఫోన్‌ కేటగిరీలో 24.1 శాతాన్ని దక్కించుకుంది.   
మరిన్ని వార్తలు