పేలిన గెయిల్ గ్యాస్ పైప్‌లైన్

4 Apr, 2015 16:04 IST|Sakshi

సూర్యాపేట: ప్రమాదవశాత్తూ గెయిల్‌కు చెందిన గ్యాస్ పైప్‌లైన్ లీకవ్వడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శనివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట గ్రామ సమీపంలో ని గెయిల్ పరిశ్రమలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... ఐదుగురు కూలీలు శనివారం గెయిల్ పైప్‌లను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పైప్‌లకు ఉన్న ఫిన్ ఊడిపోవడంతో ఒక్కసారిగా గ్యాస్ పైకి ఎగిసిపడింది. దీంతో అక్కడున్న కూలీలు వెళ్లి గోడకు బలంగా ఢీ కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారిని హైదరాబాద్‌కు చెందిన రమేష్, రోషన్‌లుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన కుడకుడకు చెందిన వెంకన్నను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులను స్థానిక మెట్రో ఆస్పత్రిలో చేర్పించగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరిని సైతం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించనున్నారు. సంఘటనా స్థలాన్ని ఆర్డీవో శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కాగా ఈ ప్రమాదం గురించి మాట్లాడేందుకు గెయిల్ అధికారులు ఎవరూ అందుబాటులో లేరు.

మరిన్ని వార్తలు