293 అంగన్‌వాడీ పోస్టులు

19 Feb, 2018 15:10 IST|Sakshi

అంగన్‌వాడీ ఖాళీలు తక్కువ.. దరఖాస్తులు ఎక్కువ 

ఒక్కో పోస్టుకు 12 మంది పైగానే.. 

ఎస్టీ అభ్యర్థులకే అవకాశాలు అధికం  

అర్హత ఆధారంగానే ఎంపికలు  

దళారుల మాటలు నమ్మవద్దంటున్న అధికారులు 

కొత్తగూడెం (అర్బన్‌) : జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల నియామకానికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో 293 పోస్టులు ఖాళీగా ఉండగా ఈనెల 14న చివరి తేదీ నాటికి 3650 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టులలో అంగన్‌వాడీ టీచర్లు 57, ఆయాలు119, మినీ అంగన్‌వాడీ టీచర్లు 117 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వీటికి గానూ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి మొత్తం 3650 మంది దరఖాస్తు చేసుకున్నారు.  

ఎవరెవరికి ఎలా... 
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల్లో అత్యధికం ఎస్టీలకు రిజర్వ్‌ అయ్యాయి. బూర్గంపాడు–1  ఎస్సీలకు, అశ్వారావుపేట–1 జనరల్, ఇల్లందు–1 జనరల్, పాల్వంచ మినీ అంగన్‌వాడీ సెంటర్లు –5 పోస్టులలో జయమ్మకాలనీ జనరల్, గొల్లగూడెం ఎస్సీ, జ్యోతినరగ్‌ జనరల్, వికలాంగుల కాలనీ జనరల్, సోనినగర్‌ బీసీ–ఏ కు కేటాయించగా, మిగత పోస్టులన్నీ ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. దరఖాస్తుల్లోనూ ఎక్కువగా ఎస్టీలవే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 

స్క్రూట్నీ, ఫీల్డ్‌ వర్క్‌ అనంతరం ఎంపికలు
అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ 14న ముగిసింది. దరఖాస్తులు, అభ్యర్థుల సర్టిఫికెట్లను ఈనెల 20 వరకు పరిశీలిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు ఐసీడీఎస్‌ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. 21వ తేదీ నుంచి ఐసీడీఎస్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుదారులు స్థానికంగా ఉంటున్నారా.. ఇతర ప్రాంతాల వారెవరైనా దరఖాస్తు చేశారా.. అనే సమాచారాలను సేకరిస్తారు. అనంతరం తుది నివేదికను సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అయిన కలెక్టర్‌కు అందజేస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల అర్హతల ప్రకారం, లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, సభ్యులుగా ఆర్డీవో, డీఎంఅండ్‌హెచ్‌వో, కన్వీనర్‌గా డీడబ్ల్యూవో, ఐటీడీఏ ఏరియాల్లో ప్రాజెక్టు ఆఫీసర్లు మెంబర్లుగా ఉంటారు. ఎంపికల్లో అభ్యర్థుల మార్కులకు 80 శాతం, వితంతువులకు –5 శాతం, వికలాంగులకు 5 శాతం, అనాథలకు 10 శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుంది.

దళారులను నమ్మొద్దు 
జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్, ఆయా, మినీ అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీ విషయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు. మార్కుల ఆధారంగా, ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ప్రకారమే భర్తీ చేస్తాం. ఎవరి మాటలు విని డబ్బు, సమయం వృథా చేసుకోవద్దు. 
–  ఝాన్సీలక్ష్మీబాయి, జిల్లా సంక్షేమశాఖాధికారిణి

మరిన్ని వార్తలు