పుత్తడి బొమ్మకు పుస్తెల తాడు

19 May, 2020 19:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

12 ఏళ్ల బాలికకు వివాహం

సాక్షి, షాద్‌నగర్‌ : బాల్య వివాహాలను రూపుమాపాలని ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తెచ్చినా సమాజంలో ఏమాత్రం మార్పు రావడంలేదు. రాజధాని సమీపంలో జరిగిన ఓ బాల్యం వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షాద్‌నగర్‌ పరిధిలోని ఫరూఖ్‌నగర్‌ మండలం అయ్యవారిపల్లిలో 12 ఏళ్ల బాలికను 37 ఏళ్ల వ్యక్తి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం కాస్తా బయటకు పొక్కడంలో బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి పత్తాలేకుండా పారిపోయాడు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అయ్యవారి పల్లి గ్రామానికి చెందని మల్లేష్‌ (37)కు కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. ఇటీవల అతని భార్య అత్మహత్య చేసుకుంది. అయితే మల్లేష్‌ అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

దీనికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా సమ్మతి తెలపడంతో మే 15న వీరికి రహస్యంగా వివాహం జరిగింది. అయితే బాలికకు పెళ్లి జరిగిందన్న ముచ్చట గ్రామంలో ఆనోటా ఈ నోటా పాకింది. ఈ విషయం షాద్‌ నగర్‌ ఐసీడీఎస్‌ అధికారులకు తెలియడంతో విచారణ ప్రారంభించారు. అధికారులు వస్తున్నారన్న సమాచారం అందటంతో కొత్త పెళ్లికొడుకు పరారయ్యాడు. సీడీపీఓ అధికారి నాగమణి గ్రామానికి వెళ్లికి విచారణ చేశారు. అనంతరం బాల్యం వివాహం జరిపిన బాలిక తల్లిదండ్రులను తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకువచ్చి కౌన్సిలింగ్‌ ఇప్పించారు. అనంతరం మైనర్‌ బాలినకు హైదరబాద్‌లోని  ప్రగతి వెల్ఫేర్‌ కేంద్రానికి తరలించారు. మల్లేష్‌పై కేసు నమోదు చేశారు. 


 

మరిన్ని వార్తలు