మర్డర్ చేశా.. వచ్చి ఫొటోలు తీసుకోండి..

13 Feb, 2015 08:24 IST|Sakshi
మర్డర్ చేశా.. వచ్చి ఫొటోలు తీసుకోండి..

- నల్లగొండ జిల్లాలో ఉన్మాది పైశాచికానందం


కోదాడ: హలో.. మీరు విలేకరులేనా? బంజారాకాలనీ నుంచి ఫోన్ చేస్తున్నా. నేను ఒకామెను మర్డర్ చేశా.. వెంటనే వచ్చి ఫొటోలు తీసుకోండి..! మీ దగ్గర నంబర్ ఉంటే పోలీసులకు కూడా ఫోన్ చేసి చెప్పండి..!! అంటూ ఓ ఉన్మాది గురువారం నల్లగొండ జిల్లా కోదాడలోని పత్రికా విలేకరులకు ఫోన్ చేసి చెప్పడం స్థానికంగా సంచలనం సృష్టించింది. విషయం తెలుసుకున్న విలేకరులు, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి నిందితుడు రక్తపు మడుగులో ఉన్న శవం పక్కనే తాపీగా కూర్చొని ఉండడాన్ని చూసి వారు కంగుతిన్నారు. పోలీసులను చూసి చేతికి గాయం చేసుకోవడంతో అతడిని చికిత్స కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

పోలీసుల కథనం ప్రకారం... కోదాడ పట్టణం బంజారా కాలనీలో నివాసముంటున్న వేముల వెంకటరమణ (35) భర్త నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. వెంకటరమణ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏడాది క్రితం సంత ఎదురుగా నివాసముండే అవివాహితుడైన చింతల రమేష్‌కు వెంకటరమణతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర శారీరక సంబంధానికి దారితీసింది. వీరి బంధాన్ని బంధువులు, కుమారులు ఒప్పుకోకపోవడంతో రమేష్‌ను వెంకటరమణ దూరంగా పెట్టింది. దీంతో కోపోద్రిక్తుడైన రమేష్.. ఉదయం 11 గంటల ప్రాంతంలో మద్యం సేవించి వెంకటరమణ ఇంటికి వచ్చాడు. ఆమెతో గొడవపడి రాడ్‌తో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో వెంకటరమణ ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


 

మరిన్ని వార్తలు