‘పోలీసులే ఈ ఘోరానికి కారకులు’

28 May, 2017 12:27 IST|Sakshi
‘పోలీసులే ఈ ఘోరానికి కారకులు’

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం రేపిన అంబోజు నరేశ్‌, స్వాతి చావుకు భువనగిరి పోలీసులే కారణమని వారి తరపు బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోందని అన్నారు. నరేశ్‌ అదృశ్యంపై ఫిర్యాదుపై చాలా రోజుల వరకు పోలీసులు స్పందించలేదని అతడి కుటుంబ సభ్యులు వాపోయారు. భువనగిరి డీసీపీ యాదగిరి ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారని ఆరోపించారు.

మేజర్ల పెళ్లి వియషంలో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకున్నారని ప్రశ్నించారు. పెళ్లైన వారానికే ఎందుకు స్వాతి-నరేశ్‌ను ముంబై నుంచి ఎందుకు రప్పించారని నిలదీశారు. మళ్లీ రెండోసారి వీరిని ఆత్మకూరు రప్పించడంలో పోలీసుల పాత్రపై అనుమానం వ్యక్తం చేశారు. ఆత్మకూరు, రామన్నపేట, భువనగిరి పోలీసుల తీరుపై నరేశ్‌ బంధువులు మండిపడ్డారు. భువనగిరి పోలీసులపై చర్యల్లేవా, ఈ దారుణానికి భువనగిరి పోలీసులు బాధ్యులు కారా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, పోలీసుల వ్యవహారశైలిపై వారు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

సంబంధిత కథనం: హత్య చేసి.. ఆపై కాల్చేసి..


 

మరిన్ని వార్తలు