స్వాతి నాయక్‌కు నార్మన్‌ బోర్లాగ్‌ అవార్డు

22 Sep, 2023 05:11 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రతిష్టాత్మక నార్మన్‌ బోర్లాగ్‌– 2023 అవార్డుకు భారతీయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వాతి నాయక్‌ ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ (ఐఆర్‌ఆర్‌ఐ)లో పనిచేస్తున్న ఆమెను అద్భుతమైన మహిళా శాస్త్రవేత్తగా వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ అభివర్ణించింది. చిన్న రైతులు సాగు చేసేందుకు వీలయ్యే ప్రశస్తమైన వరి వంగడాల రూపకల్పనలో విశేషమైన కృషి చేశారని కొనియాడింది.

ఆహారం, పోషక భద్రత, ఆకలిని రూపుమాపేందుకు ప్రత్యేకమైన కృషి సల్పే 40 ఏళ్లలోపు శాస్త్రవేత్తలకు డాక్టర్‌ నార్మన్‌ బోర్లాగ్‌ పేరిట రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ ఈ అవార్డును అందజేస్తుంది. అక్టోబర్‌లో అమెరికాలోని అయోవాలో జరిగే కార్య క్రమంలో డాక్టర్‌ స్వాతి పురస్కా రాన్ని అందుకోనున్నారు. అమెరికాకు చెందిన హరిత విప్లవం రూపశిల్పి, నోబెల్‌ గ్రహీత నార్మన్‌ బోర్లాగ్‌. కాగా, డాక్టర్‌ స్వాతి నాయక్‌ ఒడిశాకు చెందిన వారు. ఈమె 2003– 07లో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్‌సీ చదివారు.

మరిన్ని వార్తలు