ఆయుష్‌ కిట్ల రూపకల్పన అద్భుతం : ఈటెల

9 May, 2020 12:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయుష్ రక్ష కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రారంభించారు. రెడ్ జోన్ లో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బందికి ఈ కిట్స్ ను అందజేయనున్నారు. 20 వేల కిట్స్ ను మొదటి దఫా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల మాట్లాడుతూ .. ఆయుర్వేదం అతి ప్రాచీనమైన వైద్య శాస్త్రమని పేర్కొన్నారు. కరోనా ను ఎదుర్కొనేందుకు ఆయుష్ కమీషనర్ అలుగు వర్షిణి ఆధ్వర్యంలో ఆయుష్‌ డిపార్ట్‌మెంట​ ఐదు రకాల మందులతో ఆయుష్‌ రక్ష కిట్స్‌ను రూపొందించారన్నారు. ఆయుష్‌ కిట్స్‌ తయారు చేసినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచానికి ఇలాంటి వైద్యాన్ని అందించిన దేశం భారత దేశం మాత్రమేనన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశం కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్నారు. తెలంగాణలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాప్తి, మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు. (లాక్‌డౌన్‌: భారీగా రోడ్డెక్కిన వాహనాలు)

అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్‌ విశ్వప్రసాద్,  ఐజిపి హోమ్ గార్డ్స్ బాలనాగాదేవి,  సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్ రెడ్డిలకు మంత్రి ఈటల రాజేందర్  ఆయుష్‌ రక్ష కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డిపార్ట్‌మెంట్‌ అడిషనల్ డెరైక్టర్ అనసూయ, ప్రిన్సిపల్ సూర్యప్రకాష్, సూపరింటెండెంట్ పరమేశ్వర్, డ్రగ్ టెస్టింగ్ లాబొరటరీ డైరెక్టర్ శ్రీనివాస చారీ, ఫార్మసీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ కె సి. డాక్టర్ శ్రీకాంత్ బాబు, కేంద్ర ఆయుర్వేద రీసెర్చ్ కౌన్సిల్ అధికారి డాక్టర్ సాకేత రాం, నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, విశ్వ ఆయుర్వేద పరిషద్ నేషనల్ సెక్రెటరీ డాక్టర్ ప్రేమనందరావు, డాక్టర్ సురేష్ జకోటియ పాల్గొన్నారు. ఈ కిట్స్ తో పాటు విశ్వ ఆయుర్వేద పరిషద్ తరపున 250 గ్రాముల చవన్ ప్రాష్‌ను రెండు వేల యూనిట్లుగా పంపిణీ చేస్తున్నట్లు సెక్రెటరీ తెలిపారు.
(మాస్క్‌ లేకుంటే బుక్కయినట్టే..!)

మరిన్ని వార్తలు