‘ప్రశ్నించినందుకే టికెట్‌ ఇవ్వలేదు’

18 Oct, 2018 09:37 IST|Sakshi

దళితులను అవమానించిన కేసీఆర్‌

కొడుకు, బిడ్డకోసం సింగూర్‌ నీటిని తరలించారు

కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ

తాజామాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌

పుల్‌కల్‌(అందోల్‌): దళితులను అవమానిస్తూ దొరల పాలన సాగిస్తున్నా కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తాజా, మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ తెలిపారు. సింగూర్‌ నీటిని కొడుకు, బిడ్డ కోసం తరలించి ఈ ప్రాంత రైతులకు తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రమైన పుల్‌కల్‌లో పార్టీ ఎన్నికల కార్యాలయంతో పాటు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితున్ని సీఎం చేస్తానని ఆయనే సీఎం అయ్యాడని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం పనిచేసిన తనకు కాకుండా తెలంగాణ వ్యతిరేకులకు టికెట్లు ఇచ్చి అగౌరవ పరిచినట్లు ఆరోపించారు. తెలంగాణ భవన్‌పై రాళ్ల దాడి చేసిన క్రాంతికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

కేవలం క్రాంతి బ్లాక్‌మేయిల్‌ చేసి టిక్కేట్‌ సంపాదించాడని ఆవేదన వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని చిత్రపూరి కాలనీలో క్రాంతికి ఇంటి స్థలం ఎలా వచ్చింది..? తాను అలా కాకుండా ప్రజలకు మెలు చేయాలనే ఉద్ధేశంతో పనిచేస్తే ఇలా అవమానిస్తారా..? అంటూ ప్రశ్నించారు.. తెలంగాణలో 105 మందికి టికెట్లు ఖారారు చేస్తే అందులో ఇద్దరికి ఇవ్వాలేదని అందులో వారు ఎస్సీలే కావడం గమనార్హం అన్నారు. పార్టీకోసం పని చేసిన వారిని కాదని పదువులకోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు హోం మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి టికెట్‌ ఇవ్వకుండా సీనియర్‌లను అవమానిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడిచేందుకే తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు అనంతరావు కులకర్ణి, వెంకట్‌నర్సింహ్మరెడ్డి, రాజు, ప్రబాకర్‌గౌడ్, శ్యాంగౌడ్, ప్రభా‹స్, రూప్, దేవి, తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు