బండారు దత్తాత్రేయ కుమారుడి మృతి

23 May, 2018 06:10 IST|Sakshi
వైష్ణవ్‌

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు వైష్ణవ్‌(21) హఠాన్మరణం చెందారు. ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతున్న వైష్ణవ్‌ బుధవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. వివరాలు.. రాత్రి, 10 గంటలకు భోజన సమయంలో వైష్ణవ్‌ హఠాత్తుగా కుర్చీలో నుంచి కిందకు కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ముషీరాబాద్‌లోని గురునానక్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు.

ప్రత్యేక వైద్య బృందం దాదాపు రెండు గంటల పాటు శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. అర్థరాత్రి 12.15 నిమిషాలకు ప్రాణాలు విడిచారు. అయితే ఆరోగ్య కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని దత్తాత్రేయ, ఆయన సతీమణికి వైష్ణవ్‌ మరణవార్తను కుటుంబ సభ్యులు తెలియనీయలేదు. ఉదయం 5 గంటలకు కుమారుడి మరణ వార్తను విన్న దత్తాత్రేయ కన్నీరు మున్నీరు అయ్యారు. కుమారుడు ఇక లేడని తెలుసుకున్న బండారు శోకసంద్రంలో మునిగిపోయారు.

వైష్ణవ్‌ మృతదేహాన్ని తెల్లవారు జామునే దత్తాత్రేయ ఇంటికి తరలించారు. చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడంతో పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, శాసనసభ్యుడు చింతల రామచంద్రారెడ్డిలు ఆసుపత్రికి చేరుకొని దత్తాత్రేయ కుటుంబాన్ని పరామర్శించారు .

మరిన్ని వార్తలు