గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దుతా..

9 Feb, 2015 02:54 IST|Sakshi

124 గురుకుల పాఠశాలలు, 39 కస్తూర్బాగాంధీ విద్యాలయాలను పర్యవేక్షిస్తూ.. 4500మంది ఉపాధ్యాయులను సమన్వయం చేస్తూ.. 72వేల మంది విద్యార్థి, విద్యార్థినులకు విద్యాబుద్ధులు చెప్పిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు రాకుండా వసతులు కల్పిస్తున్నారు. చదువు‘కొన’ లేని ఆ పేదపిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించాలని కృషిచేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా గడిపే అధికారుల్లో ఒకరు. ఆయనే జిల్లావాసి, సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల సంస్థ
 కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. ఆయన కాస్త తీరిక చేసుకుని కమ్మదనం బాలికల గురుకుల విద్యాలయాన్ని సందర్శించారు.  ‘సాక్షి’ రిపోర్టర్‌గా విద్యార్థినుల బాగోగులు
  తెలుసుకున్నారు. గురుకులాలను తీర్చిదిద్దుతానని చెప్పారు.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: నీ.. పేరేంటమ్మా, గురుకుల లో చదువుతున్నావ్  కదా? ఎలా ఉంది.. ఎలా చదువుతున్నాం. మీ ఊరు వదిలి ఇక్కడికి వచ్చావు కదా.. నీకేమీ అనిపించడం లేదా? స్కూళ్లో బోర్ కొట్టడం లేదా?
 అంజలి(10వ తరగతి): సార్..! మాది వంగూరు. నేను ఐదో తరగతిలో ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు ఒక్కటే వచ్చేది. మ్యాథమెటిక్స్ అంటే మస్తు భయం.  పరీక్ష ఉంది అనగానే జ్వరం వచ్చేది. ఎప్పుడైతే ఇక్కడకు వచ్చానో నాకు గణితం పట్ల పూర్తిగా భయం పోయింది. ఇంతమంది అక్కవాళ్లు, ఫ్రెండ్స్ ఉండగా ఇంట్లోనే ఉన్నట్టుంది. ఉపాధ్యాయులు మమ్మల్ని వారి పిల్లల్లా చూసుకుంటున్నారు. నా లక్ష్యం ఇంజినీర్ కావడమే సార్.. మంచి ఇంజినీర్ అయి మా నాన్నకు పేరు తేస్తాను. మీ ఆశయాన్ని కూడా నెరవేరుస్తా.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: నీపేరేంటి. స్కూలుకు నీవెలా వచ్చావు. మీ స్కూల్‌లో
 ఏమేం జరుగుతున్నాయి. పాఠాలు
 అర్థమవుతున్నాయా? సిలబస్ మారింది కదా.. ఎలా చదువుతున్నారు. పాఠాలు అర్థమవుతున్నాయా?
 స్వర్ణమంజలి(కర్నూలు): సార్.. నేను ఐదో తరగతిలో జాయిన్ అయ్యాను. నేను దూరంగా ఉంటానని మా డాడీ ఎప్పుడు బాధపడుతుంటారు.
 
  సోషల్‌వెల్ఫేర్ స్కూల్‌లో చదువుకుంటే ఎంతగ్రేటో తెలుసా..! అని నాన్నకు చెప్పేదాన్ని. మారిన సిలబస్‌కు అనుగుణంగా మా టీచర్లు ప్రిపేర్ చేస్తున్నారు. ప్రశ్నలను మేమే తయారుచేసుకునే విధంగా మమ్మల్ని సిద్ధం చేస్తున్నారు. మాకు తెలియని కొత్తకొత్త విషయాలు చెప్పి పరీక్షలకు బాగా ప్రిపేర్ చేస్తున్నారు. మా బయాలజీ మేడం క్లాస్‌రూమ్‌లోకి వస్తే చాలు. ప్రపంచమంతా ఇక్కడే చూసినట్లు ఉంటుంది.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: మీ షర్టు మీద ‘వాయిస్’ అని ఉంది కదా? అంటే ఏమిటి? సఖీ అంటే ఏంటో చెబుతావా?
 స్వర్ణ: వాయిస్ అంటే క్యాంపు సార్..! మేము  వేసవి సెలవుల్లో క్యాంప్‌నకు వెళ్తుంటాం. అక్కడ సఖీ క్వాలిఫికేషన్ గురించి చెబుతారు. సఖీ అంటే పక్కవారి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవడం. మారి సమస్యలు తీర్చడం.
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: క్యాంపునుంచి వచ్చిన తర్వాత ఎంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశావు. ఏయే ప్రాబ్లమ్స్ వచ్చాయి? సరే... హాస్టల్‌లో భోజనం ఎలా ఉంది.
 
 స్వర్ణ: ఫుడ్ బాగుంది. సన్నబియ్యం వచ్చినప్పటి నుంచి కడుపునిండా తింటున్నాం. క్యాంపులో నేర్చుకున్న అంశాలను స్కూళ్లో నేర్పిస్తాం.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: ఇక్కడ క్యాంపునకు వెళ్లినవాళ్లు ఎవరైనా ఉన్నారా?
 శాంతి(9వ తరగతి): నేను డార్జిలింగ్ క్యాంప్‌నకు వెళ్లాను. అక్కడ చలి తీవ్ర త ఎక్కువగా ఉంటుంది. చలి వేయకుండా స్లీపింగ్ బ్యాగ్‌లో పడుకునేదాణ్ని. చేతులు, కాళ్లకు సాక్స్‌లు, గ్లౌజ్‌లు వేసుకుని పడుకునేవాళ్లం.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: అంత చలిలో నీరు అక్కడ గడ్డకట్టదా.. ఎలా ఉండగలిగారు..?
 శాంతి: తాగడానికి వేడినీళ్ల బాటిళ్లను స్లీపింగ్ బ్యాగ్‌లో వేసుకుని పడుకోవాలి. మొత్తం 9రోజుల పాటు బేస్‌క్యాంప్‌లో ఉన్నాం. నాలుగు కిలోల బరువు ఉన్న షూ వేసుకున్నా. చలికి కప్పుకునే దుప్పటి 20కిలోలు ఉంటుంది.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: నీ పేరేంటమ్మా.. ఇక్కడ విద్యాబోధన ఎలా ఉంది. పాఠాలు అర్థమవుతున్నాయా?  
 మహేశ్వరి(10వ తరగతి) : ఇక్కడ విద్యాబోధన చాలాబాగుంది. ఎగ్జాం అంటే భయంలేద్సార్..! మాకు మేమే క్వశ్చన్స్ తయారుచేసుకుని చదువుతున్నాం. వీటికంటే ఎక్కువ పరీక్షల్లో ఏమీ రావని మా నమ్మకం. మేమంతా గ్రూప్ డిస్కర్షన్ చేసుకుంటూ చదువుకుంటున్నాం. మా ఆలోచనలు, చదువుకునే పద్ధతిని ఒకరికొకరు పంచుకుంటాం.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: గేమ్స్‌లో
 పాల్గొన్నవాళ్లు ఎవరైనా.. ఉన్నారా?
 చైతన్య(ఇంటర్ ఫస్టియర్ బైపీసీ): సార్.. నేను ఐదో తరగతిలో ఇక్కడికి వచ్చా. ఆరేళ్లుగా ఇక్కడే చదువుకుంటున్నాను. గురుకుల పాఠశాలను వదిలివెళ్లను. నేను చాలా గేమ్స్‌లో పాల్గొన్నాను. నాకు మొన్న కొత్తగడిలో జరిగిన జోన్‌స్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. అవర్ టాపిక్స్ జీఎం ఫుడ్.. మేము ఎక్స్‌ఫోర్ ఈవెంట్‌కు వెళ్లాం సార్..!
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: అక్కడ ఎలా అనిపించింది? ఏయే ప్రాంతాలు చూశారు.?
 చైతన్య: ఎక్స్‌ఫోర్ అనే ప్లేస్‌ను చూడలేనేమో అనుకున్నా. క్లాస్‌మెంట్ ఫ్రెండ్స్‌తో కలిసి అలాంటి ప్లేస్‌కు వెళ్లాలి అనుకునేదాన్ని. అదికూడా మీవల్లే తీరింది. ఎల్‌బీ స్టేడియాన్ని నేను టీవీలోనే చూసేదాన్ని. కానీ మొన్న ప్రత్యక్షంగా చూశాను. సీసీఎంబీ, ఎంజీఆర్‌ఐ, ఎల్‌బీ స్టేడియం, ప్లానిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ  వంటి ఎన్నో ప్లేస్‌లు చూశాం.
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్:  ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లావు కదా? ఫ్యూచర్‌లో అక్కడ చదువుకునేందుకు వెళ్తావా?
 చైతన్య: అక్కడికి కచ్చితంగా వెళ్లి చదువుకుంటా. భవిష్యత్‌లో గొప్ప శాస్త్రవేత్తను కావాలని ఉంది.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్: గేమ్స్‌లో పాల్గొన్నవారు ఇంకెవరైనా ఉన్నారా?
 జ్యోతిక(10వ తరగతి): కబడ్డీ అంటే నాకు చాలాఇష్టం. ఇరవైరోజుల క్రితం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన స్వేరో ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్నాను. 1500 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నా. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా.. విజయం దక్కలేదు. ఒడిపోయినా సరే.. మీరు ప్రోత్సహించిన తీరు నాలో స్ఫూర్తినింపింది.
 
 ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హామీలు
 ఒకప్పుడు గురుకుల పాఠశాలలు సవాలక్ష సమస్యలతో సతమతమవుతుండేవి. ఎస్సీ సబ్‌ప్లాన్, అదనపు నిధులతో పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తాం. ఇక్కడున్న పిల్లలు ఎక్కువగా పేదకుటుంబం నుంచి వచ్చినవారే. కొంతమందికి తల్లిలేదు. మరికొంత మందికి తండ్రిలేడు. అలాంటి వారికి ఉపాధ్యాయులు తగినంత ప్రోత్సాహాన్ని అందిస్తూ మంచి విద్యను బోధిస్తున్నారు. పిల్లలకోసం సమ్మర్‌క్యాంప్, కోచింగ్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నాం.
 
  ‘ఈ+ క్లబ్’ ద్వారా ప్రతి విద్యార్థిలో ఇంగ్లిస్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అభివృద్ధి చేస్తున్నాం.
 వేర్వేరు ఫౌండేషన్లతో కలిసి ఉత్తమర్యాంకులు సాధించిన పాఠశాల ఉపాధ్యాయులకు అమెరికాలో శిక్షణ ఇప్పించేవిధంగా ఏర్పాట్లు చేశాం. మంచి ఉత్తీర్ణత సాధించే విద్యార్థులను కూడా అమెరికా పంపిస్తాం. దేశంలో ఏ విద్యాసంస్థ చేయని సాహసోపేతమైన క్రోడింగ్ క్యాంప్‌ను సమ్మర్‌లో ప్రవేశపెట్టబోతున్నాం. ప్రభుత్వపరంగా ఏ చిన్న అవకాశమొచ్చినా సద్వినియోగం చేసుకుని పేద విద్యార్థుల అభివృద్ధి కోసం పాటుపడతాం.
 

మరిన్ని వార్తలు