నేపాల్‌లో బిక్కు బిక్కు

27 Apr, 2015 01:39 IST|Sakshi

కఠ్మాండులో చిక్కుకున్న బొక్కలగడ్డ వాసులు
 
హన్మకొండ చౌరస్తా : నేపాల్ రాజధాని కఠ్మాండులో హన్మకొండ బొక్కలగడ్డ ప్రాంతానికి చెందిన కుటుంబం చిక్కుకుంది. బాధితుడి సోదరుడు రాపర్తి రాజేందర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బొక్కలగడ్డకు చెందిన రాపర్తి కుమార్ అస్టర్ సెల్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నాడు. ఉద్యోగరీత్యా నాలుగు నెలల క్రితం కఠ్మాండుకు బదిలీపై వెళ్లాడు. కుమార్‌తోపాటు అతడి భార్య చేతన, రెండేళ్ల కుమారుడు మిథున్ అక్కడే ఉంటున్నాడు.

రెండు రోజుల క్రితం వచ్చిన బారీ భూకంపంతో అతలాకుతలమైన ఖాట్మండు నుంచి భారత్‌కు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆదివారం మరోసారి రెండు సార్లు భూకంపం వచ్చినట్లు కుమార్ ఫోన్‌లో సమాచారం ఇచ్చాడని అతడి సోదరుడు రాజేందర్ తెలిపారు. వారు భారత్‌కు వచ్చేందుకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఖాట్మండు విమానాశ్రయంలో వేచి చూశారని, విమాన సర్వీసులు రద్దు చేయడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇక్కడి నుంచి ఫోన్ చేస్తే లైన్ దొరకడం లేదని, వారు ఫోన్ చేసినప్పుడే మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొందని కుమార్ తల్లి లక్ష్మి, తండ్రి మల్లయ్య, సోదరుడు రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు