కాంగ్రెస్‌ బస్సుయాత్ర.. తుస్సు యాత్రే..!

19 Feb, 2018 15:56 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ నర్సయ్యగౌడ్‌

యాత్ర వాహనాలకు డీజిల్, పెట్రోల్‌ కూడా దండగే

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం అధోగతి

విలేకరుల సమావేశంలో ఎంపీ బూర

నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చేపట్టాలనుకునే బస్సు యాత్ర తుస్సు యాత్రే అవుతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బస్సుయాత్ర వాహనాలకు డీజిల్, పెట్రోల్‌ కూడా దండగే అవుతుందని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. పాలకపక్షంలో ఎవరు ఉండాలో, ప్రతిపక్షంలో ఎవరు ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.

కాంగ్రెస్‌ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని, వారు మాట్లాడే పదజాలం ఏమాత్రం బాగాలేదని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ నల్లగొండలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ఎంపీ పేర్కొన్నారు. మెడికల్‌ కాలేజీ శంకుస్థాపన, బత్తాయి మార్కెట్‌ను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. బీవెల్లం ప్రాజెక్టు మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు తీసుకుని నిర్మాణ పనులు నిలిపేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక వెల్లంల ప్రాజెక్టు మీద దృష్టి పెట్టే నిర్మాణం పూర్తి చేశామని ఎంపీ తెలిపారు. మార్చి లేదా ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌ చేస్తారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం ఏజెండగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కంచర్ల భూపాల్‌రెడ్డి, మహిళా కోఆర్డినేటర్‌ మాలెశరణ్యారెడ్డి, ఎంపీపీ రేగట్టె మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు