బీజేపీ అండగా ఉంది:లక్ష్మణ్‌

19 Oct, 2019 02:10 IST|Sakshi

ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని ఆర్టీసీ కార్మికులకు పిలుపు

తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయండి

మూసాపేట: ఆర్టీసీ సమ్మెకు బీజేపీ అండగా ఉందని, కార్మికులు ఆత్మస్థైర్యా న్ని కోల్పోవద్దని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ పిలుపునిచ్చారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా శాంతియుతంగా పోరాడి హక్కులు సాధించుకుందామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా శుక్రవారం బీజేపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో బీహెచ్‌ఈఎల్‌ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కూకట్‌పల్లి, బీహెచ్‌ఈఎల్, మియాపూర్‌ 1, మియాపూర్‌ 2 డిపోల కార్మికులు, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ బైక్‌ర్యాలీలో లక్ష్మణ్‌ పాల్గొని వై జంక్షన్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్‌ ప్రస్తావించిన సమస్యలనే ఆర్టీసీ కార్మికులు ప్రస్తావిస్తుంటే ఆయన పట్టించుకోవటం లేదన్నారు. రాష్ట్రంలో నిజాంను తలపించే పాలన సాగుతోందన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన గవర్నర్‌కు ఉన్న మానవతాదృక్పథం సీఎంకు లేదంటే రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతున్నట్లే అన్నారు. తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి, ఆర్టీసీ సహ కన్వీనర్‌ రాజిరెడ్డి, జనసేన, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు