పార్టీ కార్యాలయాల్లో సందడే సందడి

3 Jun, 2014 02:00 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సంబరాలు అంబరాన్ని తాకాయి. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, సీపీఎం, తెలంగాణ రాష్ట్ర సమితి,  సీపీఐ, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ, భారతీయ జనతాపార్టీ, బీఎస్సీ ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. ముందుగా త్రివర్ణ పతాకం, తర్వాత వారి పార్టీల జెండాలను ఆవిష్కరించారు. కేక్‌లు కట్‌చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. వృద్ధులు, రోగులకు పండ్లు అందించారు. బంగారు తెలంగాణకు బాటలు వేయాలని నేతలు పిలుపునిచ్చారు.

 వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో..
 రోటరీనగర్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో సంబురాలు చేశారు. ఆదివారం అర్ధరాత్రి మొదలు సోమవారం మధ్యాహ్నం వరకు వేడుకలు జరిపారు. ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తించారు. పార్టీ ఖమ్మం నియోజకవర్గ ఇన్‌చార్జి కూరాకుల నాగభూషణం జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, బీసీసెల్ జిల్లా కన్వీనర్ తోట రామారావు, మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షురాళ్లు పద్మజారెడ్డి, కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, మైనార్టీ నాయకులు ఎండీ ముస్తఫా, ఉపాధ్యాయ విభాగం జిల్లా కన్వీనర్ గురుప్రసాద్, నాయకులు జిల్లేపల్లి సైదులు, కొదమసింహం పాండురంగాచార్యులు, తుమ్మా అప్పిరెడ్డి, ఆకుల మూర్తి, షకీనా, ఆరెంపుల వీరభద్రం, మార్కం లింగయ్యగౌడ్, షర్మిలాసంపత్, హెచ్. వెంకటేశ్వర్లు, నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో..
 కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయంలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకం, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. కేక్ కట్‌చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధులు, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యాలయం ఇన్‌చార్జ్‌లు శీలంశెట్టి వీరభద్రం, ఐతం సత్యం, శ్రీనివాసరెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోరిక లక్ష్మీబాయి, కోటా గురుమూర్తి, కొత్తా సీతారాములు, సోమ్లానాయక్, మనోహర్‌నాయుడు, కె. పద్మ పాల్గొన్నారు.

 టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో..
 తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో రాష్ట్ర అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు జగ్గారావు టీఆర్‌ఎస్‌జెండాను, యాదగిరిరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కేక్ కట్‌చేసి, మిఠాయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రడం సురేష్, కాసాని నాగేశ్వర్‌రావు, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.

 బీజేపీ సంబురాలు..
 భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో ఆపార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో కేక్ కట్‌చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో తెలంగాణ బంగారు తెలంగాణగా ఆవిర్భవిస్తుందని కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు దొంగల సత్యనారాయణ, నాయకులు విద్యాసాగర్‌రావు, వీరెల్లి లక్ష్మయ్య, పిట్టల వెంకటనర్సయ్య పాల్గొన్నారు.

 న్యూడెమోక్రసీ సమావేశం..
 సపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లాపార్టీ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ సమావేశం ఏర్పాటు చేశారు. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్, పరకాల నాగన్న, ఆవుల వెంకటేశ్వర్లు, రామయ్య, మలీదు నాగేశ్వర్‌రావు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అశోక్, ఐఎఫ్‌టీయూ నాయకులు రామారావు పాల్గొన్నారు.

 సీపీఐ ఆధ్వర్యంలో...
 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గిరిప్రసాద్ భవనంలో బాణసంచా పేల్చారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు పోటు కళావతి, జితేందర్‌రెడ్డి, నరసింగరావు, కత్తుల లక్ష్మయ్య, మహ్మద్‌సలాం, సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.

 సీపీఎం ఆధ్వర్యంలో...
 సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడారు. నిజాం నిరంకుశానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కమ్యూనిస్టులదని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొనసాగిందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పాలకులు ముందుకు సాగాల న్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వరరావు, కల్యాణం వెంకటేశ్వర్లు, యర్రా శ్రీకాంత్, ఏజే రమేష్, యర్రా శ్రీనివాస్, విక్రమ్, మల్సూర్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

 టీడీపీ జిల్లా కార్యాలయంలో
 ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బీఎస్‌పీ, జలగం యువసేన ఆధ్వర్యంలోనూ సంబురాలు జరిగాయి.

మరిన్ని వార్తలు