మా చట్టమే అనుసరించండి

1 Apr, 2018 02:59 IST|Sakshi

     ఎన్‌హెచ్‌ఏఐ రోడ్ల భూ సేకరణపై కేంద్రం 

     ఎన్‌హెచ్‌ రోడ్లకు మాత్రం పాత పద్ధతే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ రెండు చట్టాల ప్రకారం జరగబోతోంది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) రోడ్లకు రాష్ట్ర భూసేకరణ చట్టం.. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రోడ్ల నిర్మాణంలో కేంద్ర భూ సేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించనున్నారు. రాష్ట్ర చట్టం ప్రకారం భూ సేకరణకు ఎక్కువ పరిహారం ఇవ్వాల్సి ఉండటంతో కేంద్ర చట్టాన్నే అనుసరించాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతున్న రోడ్లకు భారీగా భూములు సేకరించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ఎన్‌హెచ్‌  రోడ్లకు రాష్ట్ర చట్టం ప్రకారమే భూమిని సేకరించనున్నారు.  

3,500 హెక్టార్లు అవసరం..
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చట్టా న్ని గతేడాది సవరించింది. దీంతో సంప్రదింపులతో పరిహారం పెంచుకునేందుకు భూముల యజమానులకు అవకాశం కలిగింది. సాగు ప్రాజెక్టులకు వర్తింపజేస్తున్న ఈ చట్టాన్నే జాతీయ రహదారులకూ అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల కేంద్రం రూ.8 వేలకోట్ల వ్యయంతో కొత్త జాతీయ రహదారులను మంజూరు చేసింది. వీటిని ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా చేపడుతున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ రోడ్ల విషయంలో అవసరమైన చోట్ల రోడ్ల ను 6 లేన్లకు విస్తరించాల్సి ఉండటంతో సేకరణ ఎక్కువగా ఉంటోంది.

ఎన్‌హెచ్‌ రోడ్లకు 200 హెక్టార్ల సేకరణ సరిపోనుండగా ఎన్‌హెచ్‌ఏఐకి 3,500 హె క్టార్లు కావాల్సి వస్తోంది. రాష్ట్ర చట్టం ప్రకారం సేకరిస్తే రిజిస్ట్రేషన్‌ ధరకు మూడున్నర రెట్లు చెల్లించటంతోపాటు మరింత పెంచుకునే వెసులుబాటు ఉంది. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ రోడ్లకు కేంద్ర చట్టాన్నే అనుసరించాలని కేంద్రం ఆదేశించింది. మరోవైపు కొన్ని రోడ్లకు ఏది వీలుంటే అది అన్నట్లు రెండు చట్టాలు అనుసరిస్తుండటంతో కొందరు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఏదో ఒక చట్టాన్ని అనుసరించాలని కోర్టు పేర్కొంది. వె రసి ఎన్‌హెచ్‌ రోడ్లకు రాష్ట్ర చట్టం, ఎన్‌హెచ్‌ఏఐ రోడ్లకు కేంద్ర చట్టం అనుసరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు