స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి చక్రి

11 Feb, 2015 00:45 IST|Sakshi
స్నేహానికి విలువనిచ్చే వ్యక్తి చక్రి

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని అంజనాదేవి గార్డెన్‌లో మంగళవారం ‘చక్రి ఫ్రెండ్‌షిప్‌డే’ను ఘనంగా నిర్వహించారు. చక్రి స్నేహితులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై చక్రికి నివాళులర్పించారు. ఎంతో బిజీగా ఉండే చక్రి, ప్రతి ఏడాది ఫిబ్రవరి 10న స్నేహితులతో కలిసి ఫ్రెండ్‌షిప్‌డేను నిర్వహించేవారని ఈ సందర్భంగా ఆయన స్నేహితులు చెప్పారు. ఆయన మరణించిన తర్వాత తాము అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చక్రి సతీమణి శ్రావణి, సినీ నిర్మాత వెంకట్, పాటల రచయిత కందికొండ, గాయకులు వేణు, రమణ, ప్రవీణ్, చక్రి ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.

చక్రి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా: చెవిరెడ్డి

చక్రి స్నేహానికి విలువిచ్చేవాడని, ఆయనతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్‌లో చక్రి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తానన్నారు. చక్రికి స్నేహితులంటే ప్రాణమని ఆయన సతీమణి శ్రావణి తెలిపారు. గత కొన్నేళ్లుగా ఫిబ్రవరి 10న స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారని గుర్తు చేశారు.  
 

>
మరిన్ని వార్తలు