కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతోపాటు మరో ఇద్దరిపై ‘కోడ్’ ఉల్లంఘన కేసు

2 Apr, 2014 03:30 IST|Sakshi

జఫర్‌గఢ్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని శ్రీలక్ష్మినర్సింహ రైస్‌మిల్‌పై సోమవారం రాత్రి నిర్వహించిన దాడుల్లో ఆక్రమంగా నిల్వ ఉంచిన బెల్లం, పట్టిక,  మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు ఇందుకు బాధ్యులైన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై బండారి సంపత్ కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సాగరం కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి బజ్జూరి పద్మ భర్త కృష్ణమూర్తికి చెందిన రైస్‌మిల్‌లో బెల్లం, మద్యం నిల్వ చేశారు.
 
పక్కా సమాచారంతో మామునూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. దాడుల్లో బెల్లం, పట్టికతోపాటు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు బాధ్యులైన బజ్జూరి ఆశోక్, బజ్జూరి కృష్ణమూర్తి, కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి బజ్జూరి పద్మపై కేసులు నమోదు చేశారు.అలాగే టీబీతండా సమీపంలోని మార్కెట్ యార్డ్ గోదాంపై కూడా పోలీసులు దాడులు నిర్వహించగా బెల్లంతోపాటు గుడుంబా లభ్య మైంది.

అక్కడ ఎంపీటీసీ అభ్యర్థి  పద్మ, కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి వాంకుడోత్ పద్మకు సంబంధించిన ఎన్నికల నమూనా బ్యాలెట్ పత్రాలు కూడా దొరికాయి. ఈ పత్రాలు పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా  ముద్రించి నట్లు పోలీసుల విచారణలో బయటపడడంతో  బజ్జూరి ఆశోక్, కృష్ణమూర్తి, ఎంపీటీసీ అభ్యర్థి పద్మతోపాటు ఆర్‌పీ యాక్ట్ కింద కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి పద్మపై కూడా కేసులు నమోదు చేశారు.
 
 ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నం దున పార్టీ అభ్యర్థులతోపాటు వివిధ రాజకీయ నాయకులు తప్పనిసరిగా ఎన్నికల  నిబంధనలను పాటించాలన్నారు. ఎవరైనా ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించినట్లయితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

మరిన్ని వార్తలు