ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెప్పాలి

22 Mar, 2018 06:31 IST|Sakshi
భూపాలపల్లి అంబేద్కర్‌ సెంటర్‌లో మాట్లాడుతున్న గండ్ర వెంకటరమణారెడ్డి

మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి

కొనసాగుతున్న కాంగ్రెస్‌ పార్టీ రైతు భరోసా యాత్ర

భూపాలపల్లి అర్బన్‌ : మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెప్పాలని మాజీ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి కోరారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గండ్ర వెంకటరమణారెడ్డి చేపడుతున్న రైతు భరోసా యాత్ర బుధవారం మూడో రోజుకు చేరుకుంది. బుధవారం మండలంలోని కమలాపూర్‌లో ప్రారంభమైన యాత్ర మల్లంపల్లి, బాంబులగడ్డ, అంబేద్కర్‌ సెంటర్‌ మీదగా ఫక్కిర్‌గడ్డ, గడ్డిగానిపల్లి, కాశీంపల్లి గ్రామానికి చేరుకుంది. అంతకుముందు పట్టణంలోని హన్‌మాన్‌ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.  రాత్రి కాశీంపల్లిలోనే బస చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో వెంకటరమణారెడ్డిమాట్లాడుతూ.. రాష్టŠట్రంలో రాచరిక పాలన కొనగుతోందని, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడంలో ఆత్మహత్యలు చేసుకుంటే వారిని పరామర్శించిన ప్రజాప్రతినిధులే కరువయ్యారని ఆరోపించారు. గిట్టుబాటు ధర కల్పించకుండా పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.4 వేలు ఇస్తామని రైతులను తప్పుతోవ పట్టిస్తున్నట్లు విమర్శించారు. మూడెఎకరాల భూ పంపిణీ చేస్తామని చెప్పి.. ఉన్న పోడు, అటవీ, అసైడ్‌ భూములను హరితహారం పేరుతో స్వాధీనం చేసుకుంటున్నారని తెలిపారు. రైతులకు రావాల్సిన సబ్సిడీలను టీఆర్‌ఎస్‌ నాయకులే పంచుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఏడాది వాతావారణం అనుకులించకపోవడంతో రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.  

పలువురు నాయకులసంఘీభావం..
మండలంలో వెంకటరమణారెడ్డి చేపడుతున్న యాత్రలో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, దొమ్మడి సాంబయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గండ్ర జ్యోతి, చల్లూరి సమ్మయ్య, పిన్‌రెడ్డి రాజిరెడ్డి, బుర్ర రమేష్, కుమార్‌రెడ్డి, హరిబాబు, సాగర్,  పూర్ణచందర్, కటకం జనార్దన్, మల్లేష్,  దేవన్, కరుణార్, కిరణ్, అనిల్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు