ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్‌ సిద్ధం

29 Aug, 2018 14:16 IST|Sakshi
శ్రీధర్‌బాబు 

మాజీ మంత్రి, టీపీసీసీ  ఉపాధ్యక్షుడు శ్రీధర్‌బాబు

కాటారం(మంథని) వరంగల్‌ : రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డి.శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం జిల్లాలోని కాటారం మండలం గుమ్మాళ్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో శ్రీధర్‌బాబు మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఐదేళ్లపాటు అధి కారంలో ఉండాలని ప్రజలు తీర్పిస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక టీఆర్‌ఎస్‌ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన చేయడం శోచనీయన్నారు. డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, భూపంపిణీ, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం హామీలను అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు.

ప్రజలు వీటిపై నిలదీస్తారన్న భయంతోనే ప్రజలను తప్పుదోవపట్టించడంలో భాగంగా ముందస్తు ఎన్నికల ఫ్యూహాం పన్నుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆవేదన, ఆరాటంను అర్థం చేసుకోకుండా ప్రభుత్వం ప్రగతినివేదన సభ ద్వారా అంకెల గారడి చేయడానికి సిద్ధమవుతోందని ఆరోపించారు. జ్వరంతో మృతిచెందిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, జ్వరం, డెంగీ వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శంకర్‌గౌడ్, యూత్‌ అధ్యక్షుడు చీమల సందీప్, నాయకులు తెప్పెల దేవేందర్‌రెడ్డి, రామిళ్ల కిరణ్, అజ్మీరా రఘురాంనాయక్, బొడ్డు మల్లయ్య, తాళ్ల లక్ష్మి, బక్కిరెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు