బాధ్యతారాహిత్యానికి నిండు ప్రాణం బలి

24 Jul, 2015 22:48 IST|Sakshi

 అటు వైద్యులు..  ఇటు పోలీసులు.. రెండు శాఖల అధికారుల బాధ్యతారాహిత్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ రోగిని 4రోజుల క్రితం పోలీసులు చేర్పించారు. రోగికి సహాయకులు ఎవరూ లేరని వైద్యులు నిర్లక్ష్యం చేశారు. చివరకు అతను చనిపోవడంతో, మా తప్పు లేదంటే, మా తప్పు కాదంటూ బుకాయిస్తున్నారు.                       - చౌటుప్పల్
 
 చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 21న సాయంత్రం 4గంటల సమయంలో 1033అంబులెన్సు సిబ్బంది, హైవే పెట్రోలింగ్ పోలీసులు సుమారు 50సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తిని చేర్పించారు. హైవేపై తుఫ్రాన్‌పేట స్టేజీ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇతడిని స్థానికులు గుర్తించి సమాచారమిచ్చారు. 21న ఉదయం ఇతను రోడ్డు ప్రమాదానికి గురై ఉంటాడని, చేతికి గాయం ఉందని, అంబులెన్సు సిబ్బంది చెబుతున్నారు. రోగికి సహాయకులు ఎవరూ లేకపోవడంతో వైద్యులు నిర్లక్ష్యం చేశారు. వార్డులో వేసి గ్లూకోజ్ పెట్టారు. కే-షీట్ కూడా రాయలేదు. వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆ వృద్ధుడు మృతిచెందాడు.
 
 విషయం వెలుగులోకి వచ్చిందిలా..
 సంస్థాన్ నారాయనపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసేందుకు, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ఆసుపత్రికి వచ్చారు. శవాన్ని చూసిన అనంతరం, వార్డులోకి వెళ్లగా, ఈ వృద్ధుడు ఓ మంచంపై కొన ఊపిరితో, జీవచ్ఛవంలా ఉన్నాడు. ఇది చూసి వైద్యులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. రోగికి సహాయకులు ఎవరూ లేరని, మేమేం చేస్తామని, పోలీసులకు సమాచామిచ్చినా రాలేదని సమాధానమిచ్చారు. నంద్యాల వెళ్లిపోయిన కొద్దిసేపటికే, వృద్ధుడు మృతిచెందాడు. దీంతో సీపీఎం నాయకులు డాక్టర్లను నిలదీశారు. రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ వాగ్వాదానికి దిగారు. రోగికి డాక్టర్లు కే-షీట్ కూడా రాయకపోవడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు. ఆసుపత్రి వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్నారని వైద్యులు  పోలీసులకు సమాచారమివ్వడంతో, ఎస్‌ఐ మల్లీశ్వరి పోలీసులతో కలిసి ఆసుపత్రికి వచ్చారు.
 
 ఆస్పత్రి ఎదుట సీపీఎం ఆందోళన..
 రోగి మృతికి కారణమైనై వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సీపీఎం నాయకులు చింతల భూపాల్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, రొడ్డ అంజయ్య, చీరిక సంజీవరెడ్డి, అరుణ్ తదితరులు ఆస్పత్రి ఎదుట ఆందోళకు దిగారు. డాక్టర్లపై పోలీసు కేసునమోదు చేయాలన్నారు. రోగికి కేవలం ఒక గ్లూకోజ్ ఇచ్చి వదిలేశారని, అందుకే చనిపోయాడన్నారు. అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ, గ్లూకోజులు ఎక్కించి ఉంటే బతికే వాడన్నారు.  వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని, రోగికి కే-షీట్ రాయకపోవడం చూస్తే, వైద్యుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుందన్నారు.
 
 అసలు ప్రమాదం జరిగిందెప్పుడు..?
 చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతిపై పోలీసులు వీఆర్‌ఏ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. ఈ నెల 21వ తేదీన, ఖైతాపురం శివారులో మధ్యాహ్నం 12గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని పోలీసులు కేసునమోదు చేయగా, ఆసుపత్రి వైద్యులేమో, 3రోజుల క్రితం అనగా 22వ తేదీ మధ్యాహ్నం 4గంటలకు ఆసుపత్రిలో క్షతగాత్రుడిని చేర్పించారని చెబుతున్నారు.
 
 తప్పు మాది కాదంటే.. మాది కాదు.. !
 రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సహాయకులు ఎవరూ లేకపోతే, పోలీసులే సహాయకులుగా ఉండాలి. ఇదే విషయమై, ఆస్పత్రికి వచ్చిన ఎస్‌ఐ మల్లీశ్వరిని వైద్యులు సమాచారం ఇచ్చినా ఎందుకు రాలేదని, రోగిని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. అసలు నాకు సమాచారం ఎవరూ ఇవ్వలేదని, సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్నారంటే, ఇక్కడికి వచ్చానని ఎస్‌ఐ చెప్పారు. లేదు శుక్రవారం ఉదయం 11.30గంటలకు ఫోన్ చేశానని డాక్టర్ వీరన్న చెప్పడంతో, ఎస్‌ఐ మల్లీశ్వరి అంగీకరించారు. దీంతో మల్లీశ్వరి మాట్లాడుతూ అవును నాకు రోగి మంచంపైనే మలమూత్రాలు విసర్జిస్తున్నాడని, ఏదైనా చేయమని చెప్పారని, హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పలేదని చెప్పుకొచ్చారు. అసలు మేం రోగినే చేర్పించలేదని ఎస్‌ఐ అంటే, మీవాళ్లే చేర్పించారని డాక్టర్లు, చేర్పిస్తే నాకు సమాచారమిస్తారని ఎస్‌ఐ, పెట్రోలింగ్ పోలీసులే తీసుకొచ్చారని డాక్టర్లు, ఇలా ఒకరిపై ఒకరు తప్పును నెట్టివేసుకుంటూ వాదనలకు దిగారు.
 

మరిన్ని వార్తలు