ఇలాంటి అవకాశం ఎక్కడా లేదు జైలు జీవితాన్ని పంజాబ్ రాష్ట్రంలో వివరిస్తాం
సంగారెడ్డి క్రైం: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా జైలు మ్యూజియంలోని ఫీల్ ద జైల్ ఎంతో ఆదర్శనీయమని పంజాబ్ రాష్ట్రంలోని రాజ్కోట్కు చెందిన అక్కా చెల్లెళ్లు ఆయుర్వేదిక్ వైద్యురాలు ఉపాసన శర్మ, ఎస్బీఐ ఉద్యోగి పూనం శర్మ కితాబిచ్చారు. బుధవారం 24 గంటల జైలు జీవితాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణంలో వారు మాట్లాడారు. ఎలాంటి నేరం చేయకుండా జైలు జీవితం అనుభవించే అవకాశం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇక్కడి పరిస్థితులు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. జైలు సిబ్బంది, అధికారులు, మ్యూజియం, ఫీల్ ద జైల్ల గురించి వివరించారన్నారు. కేరళ రాష్ట్రంలో ఆదరణ పొందిన ఆయుర్వేదిక్ వైద్యం జైలు మ్యూజియంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సిబ్బంది అందించిన ఆహారం చాలా బాగుందని, ఇక్కడ పరిస్థితులను తమ బంధువులకు, పంజాబ్ రాష్ట్రంలోని అధికారులకు, తమ స్నేహితులకు వివరిస్తామని చెప్పారు.