బాలిక నిర్బంధం.. అత్యాచారం

19 Mar, 2015 00:24 IST|Sakshi

- బాధితురాలి ఫిర్యాదు, కేసు నమోదు
దోమ: ఓ యువకుడు బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా దోమ మండల కేంద్రానికి చెందిన యువకుడు ముక్తియార్(22) గత నెల 9 వ తేదీన మండల పరిధిలోని మైలారం గ్రామానికి చెందిన ఓ బాలిక(17)ను తన స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగు రోజుల క్రితం బాలికను ఓ స్నేహితుడి సాయంతో స్వగ్రామానికి పంపించే యత్నం చేశాడు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు.. కాపుకాసి మార్గం మధ్యలో చేవెళ్ల సమీపంలో బాలికతోపాటు యువకుడి స్నేహితుడు విక్కీని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. అనంతరం బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ముక్తియార్ పరారీలో ఉన్నాడు. అతడికి సహకరించిన కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌కు చెందిన విక్కీ, పరిగి మండలం ఎర్రగడ్డపల్లికి చెందిన సోనులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడిపై అక్రమ నిర్బంధం, అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు