గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి

25 Nov, 2014 03:03 IST|Sakshi
గని కార్మికులకు వారసత్వ ఉద్యోగాలివ్వాలి

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు(ఖమ్మం) : సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సెంబ్లీ సమావేశం జీరో అవర్‌లో ఈసమస్యపై చర్చించినట్లు ఆయన ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలి పారు. 1998లో కోల్‌ఇండియా వ్యాప్తంగా సింగరేణిలో సైతం కార్మికులను కుదించాలనే నిర్ణయంతో వారసత్వ ఉద్యోగాలను రద్దు చేయడంతోపాటు డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌పై నిషేధం విధించారని అన్నారు. అప్పటినుంచి సింగరేణిలో రిక్రూట్ మెంట్ సైతం సక్రమంగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ భారీగా తగ్గిపోతోందని, ఉత్పత్తి లక్ష్యాలను పెంచుతున్న యాజమాన్యం కార్మికుల సంఖ్యను పెంచడం లేదని చెప్పారు.

గుర్తింపు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘం(టీబీజీకేఎస్) డిపెండెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఇప్పిస్తామని వాగ్దానం చేసిందని, అసెంబీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుకు చేశారు. తెలంగాణలోనే అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించి త్వరలో ఉద్యోగ విరమణ పొందే కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరినట్లు ఆయన వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి హరీష్‌రావు వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట వాస్తవమేనని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హమీఇచ్చినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు