10న పెద్దపల్లికి గవర్నర్‌ రాక 

7 Dec, 2019 08:19 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి: రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఈనెల 10న జిల్లా పర్యటనకు రానున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు... ఈనెల10న రాత్రి గవర్నర్‌ ఎన్టీపీసీకి చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి (బుధవారం) ఉదయం స్వచ్ఛతలో జాతీయస్థాయి అవార్డు పొందేందుకు చేపట్టిన పనులతోపాటు  పెద్దపల్లిలోని సబల నాప్‌కిన్‌ తయారీ కేంద్రాన్ని సందర్శించే అవకాశముంది. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ చైర్మన్‌ హోదాలో రాష్ట్రస్థాయి వార్షిక సమావేశంలో కలెక్టర్‌ శ్రీదేవసేన అందించిన సేవలకు అక్టోబర్‌ 24న అవార్డు అందుకున్నారు.

అదే వేదికపై జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు, స్వచ్ఛతలో జాతీయస్థాయి అవార్డు ప్రధాని చేతులమీదుగా అందుకున్న విషయాన్ని కలెక్టర్‌ గవర్నర్‌కు వివరించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వయంఉపాధితో ఆర్థికంగా ఎదిగేందుకు మహిళలతో నిర్వహిస్తున్న సబల బ్రాండ్‌ శానిటరీ నాప్‌కిన్స్‌ యూనిట్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ సమయంలో పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చి జిల్లాలో అమలవుతున్న స్వచ్ఛత కార్యక్రమాలను పరిశీలిస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారు. ఈమేరకు పర్యటన ఖరారు అయినట్లు తెలిసింది. 

మరిన్ని వార్తలు