‘కాసు’పత్రులకు చెక్‌!

5 Feb, 2017 06:49 IST|Sakshi
‘కాసు’పత్రులకు చెక్‌!

- కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో అడ్డగోలు వసూళ్లకు కళ్లెం
- కేంద్ర క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టుకు అనుగుణంగా
- రాష్ట్రంలో చట్టం తేనున్న ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలకు వసూలు చేస్తున్న భారీ ఫీజులను నియంత్రించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు చట్టం తేవాలని యోచిస్తోంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్‌) చట్టం– 2010 ఉంది. దాన్ని రాష్ట్రానికి వర్తింపచేస్తూ మరో చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర చట్టాన్ని తెలంగాణకు వర్తింపజేసేలా ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ఆమోదించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించిన కసరత్తు కూడా పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర చట్టాన్ని రాష్ట్రానికి వర్తింపచేస్తూ కొన్ని మార్పులు చేర్పులతో మరో చట్టం తీసుకొస్తే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగంలో కీలకమైన మార్పులు వస్తాయని అంటున్నారు. రోగులకు నిర్దిష్ట ప్రమాణాల మేరకు వైద్యం, వసతులు, సేవలు అందించాలన్నదే ఈ చట్టం ప్రధాన ఉద్దేశం.

ప్రమాణాలకు పెద్దపీట: రాష్ట్రంలో ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఫీజుల వసూలుకు ఇప్పటిదాకా ఒక కొలమానం అంటూ లేదు. ఒకే చికిత్సకు ఒక్కో ఆస్పత్రి ఒక్కోరకంగా రోగుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. వాటిపై ఎలాంటి నియంత్రణా లేదు. దీంతో రోగులు గత్యంతరం లేక తమ ఆస్తులను ప్రైవే టు ఆస్పత్రులకు ధారపోస్తున్నారు. అంతేకాదు.. అవ సరమున్నా లేకున్నా వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు చేయ డం పరిపాటిగా మారింది. ఎందుకు శస్త్రచికిత్స చేస్తు న్నారో కూడా అంతుపట్టని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇక క్లినిక్‌లైతే ఇరుకు సందుల్లో ఎలాంటి ప్రమాణాలు లేకుండానే నడిపించేస్తున్నారు. మరోవైపు డయాగ్నస్టిక్‌ సెంటర్లు గల్లీకొకటి పుట్టుకొస్తున్నాయి. వీటిల్లోని దాదాపు సగానికిపైగా కేంద్రాల్లో ప్రమాణాలు పూజ్యం. ఇలా ప్రతీ అంశానికి సంబంధించి మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఇప్పటివరకు దేశంలో నాలుగు రాష్ట్రా లు కేంద్ర చట్టాన్ని వర్తింపజేసుకొని కొత్త చట్టాన్ని తీసు కొచ్చాయి. ప్రతీ ప్రధానమైన శస్త్ర చికిత్సలకు కేంద్రం మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఇక రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా కొనసాగిస్తారు.

కొత్త ముసాయిదా బిల్లులో ముఖ్యమైన అంశాలివీ..
కొత్త చట్టం రూపొందించాక రాష్ట్రస్థాయిలో ఒక కౌన్సిల్‌ నియమిస్తారు. దానిద్వారా మొత్తం చికిత్సలను ఆన్‌లైన్‌ చేస్తారు. ∙కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీ హెచ్‌ఎస్‌), ఆరోగ్యశ్రీలో మాదిరిగా ఏకీకృత ఫీజులను నిర్ధారిస్తారు. ∙క్లినిక్‌లు, ఆçస్పత్రులు, నర్సింగ్‌హోంలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏవైనా ఈ కౌన్సిల్‌లోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఉన్న వాటికే అనుమతి ఇస్తారు. ∙ప్రతీ ఆçస్పత్రిపై 15 రోజులకోసారి సమీక్ష జరుగుతుంది.

ఒక చికిత్స అనవసరంగా చేస్తే తగు చర్య తీసుకునే అధికారం రాష్ట్రస్థాయిలో ఏర్పాటయ్యే కౌన్సిల్‌కు ఉంటుంది. ∙చిన్న చిన్న గల్లీల్లో ఎలాంటి కనీస వసతులు లేకుండా క్లినిక్‌ల ఏర్పాటుకు అనుమతించరు. ∙ప్రస్తుతం సీజీహెచ్, ఆరోగ్యశ్రీ ధరల కంటే రెండింతలకు మించి కార్పొరేట్‌ ఆస్పత్రులు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొత్త చట్టంతో ఇలాంటి పరిస్థితికి చెక్‌ పడుతుంది. ∙ప్రతీ రోగి వివరాలను.. అతనికి అందిన శస్త్రచికిత్స వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పొందుపరచాలి.

మరిన్ని వార్తలు