'తెలంగాణలో ఒక నీతి.. ఏపీలో మరో నీతి'

24 Nov, 2014 19:56 IST|Sakshi

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒకనీతి, ఆంధ్రప్రదేశ్లో మరొక నీతి పాటిస్తోందని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో తాము రుణమాఫీ చేశామని, ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి అయినా మాఫీ చేసిందా అని ప్రశ్నించారు.

విద్యుత్ చార్జీలను తగ్గించమంటే రైతులను కాల్చిచంపిన పార్టీ టీడీపీ అని హరీష్ రావు విమర్శించారు. గుర్రాలతో ప్రజలను తొక్కించిన పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో 59 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వందలాదిమంది రైతులు పిట్టల్లా రాలిపోతున్నారని, టీడీపీకి నిజంగా ప్రేముంటే రైతులను ఎందుకు ఆదుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ నాయకులు చేసిన యాత్ర మొసలి కన్నీరు కాదా? టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురదజెల్లే ప్రయత్నం కాదా? అనంతపురం జిల్లా రైతుల ఆత్మహత్యలు ఎందుకు వినిపించడం లేదు? అంటూ హరీష్ రావు టీడీపీపై విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు